పోలింగ్‌ అధికారిని  ప్రద్యుమ్న బెదిరించారు

YSR Congress Party Team Request To Election Commission Of India - Sakshi

చంద్రగిరిలో రిగ్గింగ్‌పై నివేదిక ఇవ్వకుండా కలెక్టర్‌ భయపెట్టారు: విజయసాయిరెడ్డి

సీసీ ఫుటేజీ పరిశీలించాలని మేం కోరినా పట్టించుకోలేదు

రిగ్గింగ్‌పై ఎన్నికలు జరిగిన మర్నాడే ఫిర్యాదు చేశాం

టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న రాప్తాడు ఆర్వోను పోలింగ్‌ విధుల నుంచి తప్పించండి

కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ బృందం వినతి

సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్‌ జరిగిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తాము ఫిర్యాదు చేసినా నిజాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టిన కలెక్టర్‌ ప్రద్యుమ్నపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు ఆర్వోను కూడా కౌంటింగ్‌ విధుల నుంచి తప్పించాలని విన్నవించింది. గురువారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆటంకాలు సృష్టించేలా అధికార టీడీపీ కుట్రలు పన్నిందని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బుట్టా రేణుక, పి.రవీంద్రబాబు, అవంతి శ్రీనివాసరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో కూడిన బృందం శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలతో సమావేశమై పలు వినతిపత్రాలు ఇచ్చింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ  తన పేషీలో పనిచేసిన అధికారిని చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా నియమించి ఆయన ద్వారా చంద్రగిరిలో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరించారు... 
‘ఎన్నికలు పూర్తయిన మర్నాడే ఏప్రిల్‌ 12వతేదీన ఈవీఎంలన్నీ సీల్‌ చేసే రోజు మా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరిలో రిగ్గింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎన్నికల అధికారులతో ముఖ్యంగా కలెక్టర్‌ ప్రద్యుమ్నతో కుమ్మక్కై దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశాం. కొందరు వచ్చినా సిరా చుక్క వేసి పంపించేశారు. అందరి ఓట్లనూ టీడీపీకి చెందిన వ్యక్తి వేశారని ఫిర్యాదులో నివేదించాం. ఏడు పోలింగ్‌ బూత్‌ల్లో ఇలాగే చేశారని ఫిర్యాదు ఇచ్చాం. అయితే పోలింగ్‌ ఆఫీసర్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న బెదిరించారు. పోలింగ్‌ ఆఫీసర్‌ను ప్రాణాలు తీస్తామని బెదిరించి రిగ్గింగ్‌ జరగలేదని రాయించారు. సీసీ ఫుటేజీని పరిశీలించాలని మేం కోరినా కలెక్టర్‌ పట్టించుకోలేదు. మా వినతిని తిరస్కరించి రిగ్గింగ్‌ జరగలేదని నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. వీడియో ఫుటేజీలు చూశాక ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇంత దుర్మార్గం ఎక్కడా జరిగి ఉండదని భావిస్తూ రీ పోలింగ్‌కు ఆదేశించారు.  

గతంలో కూడా... 
ఈ ఎన్నికల్లోనే కాదు.. 2014 ఎన్నికల్లో కూడా ఈ ఐదు బూత్‌ల్లో మొత్తం పోలైన ఓట్లు తెలుగుదేశానికే వచ్చాయి. ఏ ఒక్క ఓటూ ఇతర పార్టీకి పడలేదు.   కలెక్టర్‌ ప్రద్యుమ్న లాలూచీ పడి రేపు కౌంటింగ్‌ రోజు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రమాదం ఉందని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై చర్యలు తీసుకోవాలని కోరాం.  

వీవీ ప్యాట్ల స్లిప్పులపై స్పష్టత కోరాం... 
కౌంటింగ్‌కు సంబంధించి కూడా ఈసీకి పలు విన్నపాలు చేశాం. పోలింగ్‌ ప్రారంభానికి ముందు 50 ఓట్లకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈవీఎంలన్నీ క్లియర్‌ చేశాక వీవీ ప్యాట్ల స్లిప్పులను క్లియర్‌ చేయని పక్షంలో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్క ఎక్కువగా వస్తుంది. ఈవీఎంలలో తక్కువ ఓట్లు వస్తాయి. దీనిమీద స్పష్టత ఇవ్వాలని ఈసీనికోరాం.

రాప్తాడు ఆర్వోను తప్పించాలి... 
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్‌ మంత్రి సునీతమ్మకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్‌ విధుల నుంచి ఆమెను తొలగించాలని కోరాం. టీడీపీ అసాంఘిక శక్తులకు, గూండాలు, రౌడీలకు శిక్షణ ఇచ్చి పోలింగ్‌ ఏజెంట్లుగా, కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించింది. అధికార పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చే చోట శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని వారికి స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఈ విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తెచ్చాం.  

ఈసీ దృష్టికి డూప్లికేట్‌ ఓటింగ్‌  
పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో విద్యార్థులను, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లను పోలింగ్‌ ఏజెంట్లకు సహాయకులుగా ఇచ్చారు. బహుశా విద్యార్థులను వినియోగించడం చరిత్రలో మొదటిసారి. పోలింగ్‌ విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారు. కానీ వీరి ఓట్లు అటు వారి పోలింగ్‌ స్టేషన్లలోనూ ఇటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా పడ్డాయి. ఇలా డూప్లికేట్‌ ఓటింగ్‌ జరిగిన విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తెచ్చాం. కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులనే కాకుండా అదనంగా కేంద్ర బలగాలను పంపి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరాం.  

ప్రద్యుమ్నకు అక్రమాలన్నీ తెలుసు.. 
పశ్చిమ బెంగాల్‌లో కార్యదర్శిని బదిలీ చేశారు కానీ ఏపీలో సీఎస్‌ లేఖ రాసినా చర్యలు తీసుకోలేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రస్తావించగా ‘చంద్రగిరిలో ఐదు పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి ఒకే వ్యక్తి అందరి ఓట్లను రిగ్గింగ్‌ చేసినందువల్లే రీపోలింగ్‌కు ఆదేశించారు. సీసీ ఫుటేజీలో ఒకే వ్యక్తి బటన్‌ నొక్కుతున్న విషయాన్ని ఈసీ గుర్తించింది. నిజానికి మేం ఏడు పోలింగ్‌ బూత్‌ల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ ఐదు పోలింగ్‌ బూత్‌లలో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్‌ ప్రద్యుమ్నకు లై డిటెక్టర్‌తో పరీక్ష నిర్వహిస్తే చంద్రగిరిలో జరిగిన పోలింగ్‌ అక్రమాలన్నీ బయటకు వస్తాయి.  

సీఎస్‌కు ఫిర్యాదు కాపీ పంపితే తప్పేముంది? 
సీఎస్‌కు ఫిర్యాదు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు పేర్కొనగా ‘ఏ ఫిర్యాదునైనా సీఈవోకు, సీఎస్‌కు ఇస్తాం. సీఎస్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మేం పంపే ప్రతి ఫిర్యాదునూ ఆయనకు ఒక కాపీ పంపిస్తున్నాం. ఇందులో తప్పులేదు. వీరంతా ఎన్నికల సంఘం పరిధిలోకే వస్తారు..’ అని బదులిచ్చారు.  

మా పార్టీ పాత్రపై జగన్‌ నిర్ణయిస్తారు 
‘దేశ రాజకీయాల్లో వైఎస్సార్‌ సీపీ పాత్ర ఏమిటన్నది ఎన్నికల ఫలితాల తర్వాత .. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు..’ అని విజయసాయిరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

సీఎం రమేశ్‌ వ్యాఖ్యలపై స్పందించాలాసీఎం రమేశ్‌ ?
కేంద్ర హోంశాఖలో ఓ అధికారి వైఎస్సార్‌సీపీ తరపున లాబీయింగ్‌ చేసి రీ పోలింగ్‌కు ఆదేశించేలా చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపణలు చేయటాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘సీఎం రమేష్‌ లాంటి క్యారెక్టర్‌ లేని వ్యక్తి ఆరోపణలు చేస్తే దానిపై నేను స్పందించాలా? ఆయన గత చరిత్ర అందరికీ తెలుసు. క్యారెక్టర్‌ గురించి మీకు తెలుసు. ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు..’ అని వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈసీ వ్యవహారాలపై దర్యాప్తు చేయిస్తామని టీడీపీ ఎంపీ రమేశ్‌ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ‘ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. సీఎం రమేష్‌ లాంటి బుర్ర లేని వ్యక్తి  దానిపై ఇన్వెస్టిగేషన్‌ చేయిస్తామనడం హాస్యాస్పదం..’ అని పేర్కొన్నారు. 

దళితులంటే బాబుకు చిన్నచూపు 
ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే టీడీపీ నేతలు దళితులను ఓటేయకుండా చేశారు. సీఎం చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు మీరు కూడా చూశారు. ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? అంటూ చంద్రబాబు గతంలో దళితులను కించపరిచేలా మాట్లాడారు. ఓట్లేయకుండా చంద్రబాబు దళిత ద్రోహిలా వ్యవహరిస్తున్నారు. దళితులను హింసించిన వ్యక్తి చింతమనేని ప్రభాకర్‌. టీడీపీలో చాలా మంది నేతలు దళితులను చిన్నచూపు చూస్తున్నారు. 

అధికారులను బెదిరించారు: మేకపాటి 
‘చంద్రగిరిలోని ఐదు పోలింగ్‌ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే మేం ఈసీకి ఫిర్యాదు చేసినా అధికారులను భయపెట్టి ఏమీ జరగలేదని నివేదిక ఇచ్చారు. వీడియో ఫుటేజీలు చూశాక ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించింది. అధికారానికి బానిసగా మారిన సీఎం చంద్రబాబు ఎలాగైనా గెలవాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం’ అని మేకపాటి వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top