
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిశారు. ఆయన సారథ్యంలోని పార్టీ ప్రతినిధి వర్గం మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో గవర్నర్ను హైదరాబాద్లోని రాజ్భవన్లో కలిశారు.
రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ ముగిశాక తమ పార్టీ వారిపై, తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడుతుండటాన్ని జగన్ గవర్నర్కు వివరించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలనా తీరుపై కూడా గవర్నర్ దృష్టికి తెస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు జంగ కృష్ణమూర్తి, ఆదిమూలపు సురేష్, గోవర్ధన్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీకాంత్రెడ్డి, అవంతి శ్రీనివాస రావు, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.