చేనేత కార్మికులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి | YS Jagan Meeting With Weavers At Mangalagiri | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి

Apr 10 2018 6:27 PM | Updated on Aug 8 2018 5:54 PM

YS Jagan Meeting With Weavers At Mangalagiri - Sakshi

సాక్షి, మంగళగిరి: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికులందరికీ సబ్సిడీ కింద నెలకు రెండు వేల రూపాయలు అందిస్తామని, 45 ఏళ్లు దాటగానే పెన్షన్‌ వర్తింపజేస్తామని, ఆయా కుటుంబాల ఉన్నతికి, పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాటిచ్చారు. 133వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళవారం మంగళగిరిలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నేతన్నలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరించిన ఆయన.. నవరత్నాల్లో భాగంగా రేపు రాబోయే ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏమేం చెయ్యబోతున్నదో వివరించారు.

నాలుగేళ్లు మోసపోయాం: ‘‘మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం తదితర నియోజకవర్గాల్లో చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క ధర్మవరంలోనే ఇప్పటివరకు 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయినవారికి ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని అసలేమీ జరగలేదన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. గత ఎన్నికల్లో వృత్తి కార్మికుల మాదిరి ఫొటోలు దిగి, అందరికీ అన్నీ చేస్తానన్న ఆయన మోసం తప్ప మరేదీ చెయ్యలేదు. చేనేత కార్మికుల రుణమాఫీ అని, ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1లక్ష రుణం అని, బడ్జెట్‌లో చేనేతలకు ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తానని, ఇళ్లు, మగ్గం షెడ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. గడిచిన నాలుగేళ్లలో చేనేతలకు 180 కోట్ల రూపాయలకు మించి ఖర్చుచేయని పరిస్థితి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనకేదైనా మంచి జరిగిందా, జీవితాలు నిన్నటికంటే మెరుగయ్యాయా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ దుర్మార్గ పాలనను అంతం చేయాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మన ప్రభుత్వం వస్తే నేతన్నను ఆదుకుంటాం: వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, నాటి వైఎస్సార్‌ చేసిన మంచి పనులకు రెండింతలు ఎక్కువేచేసి, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ మేరకు ఇదివరకే నవరత్నాల్లో ప్రకటించిన అంశాలను మరోసారి ఆయన గుర్తుచేశారు. చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు మొదలుకొని సబ్సిడీ కింద నెలకు రూ.2వలు అందజేత, 45 ఏళ్లు దాటిని వృత్తి కార్మికులందరికీ నెలకు రూ.2 వేల పెన్షన్‌, నేతన్నలకు ఇళ్లు కట్టించడంతోపాటు మగ్గం షెడ్ల ఏర్పాటు, వర్షాకాలంలో మగ్గం నీటమునిగితే ఆ కాలానికి గానూ భృతి చెల్లిస్తామని వైఎస్‌ జగన్‌ హమీ ఇచ్చారు. వీటితోపాటు అందరికీ వర్తించే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అవ్వాతాతలకు పెన్షన్‌ లాంటి పథకాలనూ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. ముఖాముఖి సందర్భంగా పలువురు చేనేత కార్మికులు, మహిళలు జగన్‌తో తమ అభిప్రాయాలను పంచుకుని, సమస్యలను నివేదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement