హోదా వచ్చే దాకా పోరాటం

We Shall Fight Until Special Status Is Attained - YSR Congress - Sakshi

ఏపీ అభివృద్ధికి అది అత్యంత కీలకం: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పడమర అనంతపురం (చాపాడు): రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక హోదా అత్యంత కీలకమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారు. హోదా సాధించే వరకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరాడతామని ప్రకటించారు. బుధవారం వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం పడమర అనంతపురం గ్రామంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఐదు కాదు.. 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించారని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని, ఇప్పటివరకు 25 ఉద్యమాలు, ధర్నాలు, యువభేరి సభలు నిర్వహించారని చెప్పారు. ఈ నేపథ్యంలో మార్చి 1న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 5 నుంచి బడ్జెట్‌పై రెండో విడత పార్లమెంట్‌ సమావేశాలు ఉంటాయని, ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పారు.

అన్యాయాన్ని జనం గమనిస్తున్నారు: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
గ్రామాల్లో ఎక్కడా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేయటం లేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 15 ఏళ్లుగా చాపాడు – నక్కలదిన్నె రోడ్డు పనులు చేపట్టటంలేదని విమర్శించారు. కేవలం తన సొంత గ్రామం అనే కారణంతో నిధులు మం జూరు కాకుండా టీడీపీ ఇన్‌చార్జి అధి కారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇరుకైన రోడ్డులో పలు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధి కారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటలక్ష్మమ్మ, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, నాయకులు లక్ష్మయ్య, వైఎస్సార్‌ సీపీ జిల్లా లీగల్‌ సెల్‌ అధికార ప్రతినిధి జ్వాలా నరసింహశర్మ, మం డల కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, దండురాజు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top