కాంగ్రెస్‌కు రెండు స్థానాలిస్తాం.. రేపే ప్రకటన..!

We Can Give To Seats To Congress Says Akhilesh - Sakshi

లక్నో: లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పూర్వవైభవం కోసం ఎస్పీ, బీఎస్పీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకప్పుడు యూపీలో చక్రంతిప్పిన అఖిలేష్‌, మాయావతిలు గత ఎన్నికల్లో ఘోర పరాభావం మూటకట్టుకున్న విషయం తెలిసిందే.  80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో మోదీ చరిష్మాతో బీజేపీ ఏకంగా 73  స్థానాల్లో జెండా పాతింది. ఈ నేపథ్యంలో పోయిన బలాన్ని తిరిగి పొందెందుకు ఎస్పీ, బీఎస్పీలు దశాబ్దాల వైరుధ్యాన్ని పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చాయి. దానిలో భాగంగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నాయి.

కూటమి సీట్ల పంపకంపై అఖిలేష్‌, మాయావతిలు రేపు (శనివారం) ఉమ్మడి మీడియా సమావేశం ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. లక్నోలోని ఓ హోటల్‌లో వీరి సమావేశం ఉంటుందని సమాచారం. అయితే వీరి కూటమిలో కాంగ్రెస్‌ ఉంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీనిపై శుక్రవారం అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా బలంలేదు. మా కూటమిలో వారు ఉంటారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.  కానీ రెండు లోక్‌సభ స్థానాలను(అమేథి, రాయబరేలి) మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మోదీని ఎదుర్కొవాలంటే మేమంతా తప్పక కలిసి పోటీచేయాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.

అయితే తాము ఏర్పాటు చేయబోయే కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ ఉండదని మాయావతి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ఎస్పీ బొక్కబోర్ల పడ్డింది. కాగా శనివారం ఎస్పీ, బీఎస్పీల కూటమి ప్రకటన ఉన్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విమర్శల దాడి ఇదివరకే మొదలుపెట్టారు. సొంతప్రయోజన కోసమే వారు కూటమి కడుతున్నారని యోగి ఆరోపించారు. అఖిలేష్‌, మాయాల కూటమిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా విమర్శనాస్త్రలను సందించారు. ఒకరినొకరు చూసుకోలేని వారు కూడా మోదీని ఓడించేదుకు ఒకటవుతున్నారని మండిపడ్డారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top