కాంగ్రెస్‌ చెబుతున్న వాటినే ప్రకటించడానికి సిగ్గుండాలి: ఉత్తమ్‌

Uttam Kumar Reddy Says TRS Copied Congress Manifesto - Sakshi

అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేసిందేంటి?

ఓడిపోతామనే భయంతో మేం చెప్పినవన్నీ చేస్తామంటున్నారు

కనువిప్పు కలిగినందుకు సంతోషం.. ఇది కాంగ్రెస్‌ విజయమే

కాంగ్రెస్‌ వేవ్‌ చూసి కేసీఆర్‌కు వణుకు పుడుతోంది

టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టోను ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది నుంచి కాంగ్రెస్‌ చెబుతున్న విషయాలను మక్కికి మక్కి కాపీ కొట్టి తమ మేనిఫెస్టోగా చెప్పుకొన్న దయనీయ స్థితికి టీఆర్‌ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేరుకున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టో అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటనలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఓటమిని, కాంగ్రెస్‌ విజయాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంగళ వారం గాంధీభవన్‌లో హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలసి ఉత్తమ్‌ మాట్లాడారు. ‘నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవబోతోందని, గెలిచాక రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తాము అమలు చేయబోయే విషయాలను గత ఏడాది నుంచి చెబుతున్నాం. అర్ధంతరంగా అసెంబ్లీని రద్దు చేసుకుని, ముందస్తు ఎన్నికలకు పోయి, తప్పకుండా ఓడిపోతామని, కాంగ్రెస్‌ గెలుస్తుందని నిర్ధారించుకున్నాక కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న విషయాలను ఇప్పుడు కేసీఆర్‌ చెప్పారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్యలు, ప్రకటనలు ఉంటాయా?’అని ప్రశ్నించారు.

తాము నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామంటే తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌లు హేళన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో తమకు తెలియదని, తామే నిరుద్యోగులమవుతామని, ఎట్లిస్తరని, లెక్కలున్నాయా అని అడిగారని, మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా నిరుద్యోగ భృతి ప్రకటించారని పేర్కొన్నారు. కేసీఆర్‌ నిరుద్యోగ భృతి ఇస్తామని, తెలంగాణలో 12,13 లక్షల మంది నిరుద్యోగులున్నారని సర్వేలో తేలిందని అంటున్నారంటే తాము ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయామని ఒప్పుకున్నట్టే కదా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రకటనలు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ మునిగిపోయే పడవ అని, కాంగ్రెస్‌ గెలిచినట్టేనని ఆయనే ఒప్పుకున్నారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాము చెప్పినవన్నీ అమలు చేయాలంటే దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లు కలిపినా చేయలేరని కేటీఆర్‌ అన్నారని, ఇప్పుడు దానికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్నిబట్టి కేసీఆర్, కేటీఆర్‌లు తప్పుడు ప్రకటనలు చేశారని స్పష్టమవుతోందన్నారు.
 
కొన్ని నెలలకు నిద్ర లేచి
సామాజిక పింఛన్ల విషయంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, నేత కార్మికులకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పింఛన్‌ పెంచుతామని, వికలాంగులకు నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇస్తామని తాము చెప్పిన కొన్ని నెలలకు నిద్రలేచి అదే ప్రకటనను ఇదిగో మా మేనిఫెస్టో అంటూ కేసీఆర్‌ ప్రకటించారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. మార్కెట్‌ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, రైతులకు సాయం చేస్తానని ఈరోజు అంటున్నాడని, గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో 4,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని అమానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని మండిపడ్డారు. ఏకకాల రుణమాఫీ చేయాలని, మూడు, నాలుగు సార్లు ఇవ్వడం అర్థరహితమని, రైతులకు సరైన రీతిలో లబ్ధి కలగదని అటు అసెంబ్లీలో, ఇటు బయట తాము లేవనెత్తితే రైతులకు వడ్డీ కూడా తానే చెల్లిస్తానని ఆ మాట కూడా తప్పాడని విమర్శించారు. ఓటమికి భయపడే రైతుల గురించి సుదీర్ఘంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, పింఛన్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీలన్నీ కాంగ్రెస్‌ చెప్పిన విషయాలేనని, ఇప్పటికయినా కనువిప్పు కలిగినందుకు సంతోషమని అన్నారు. 

నాలుగేళ్లు ఎందుకు చేయలేదు?
నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులను మళ్లీ గెలిపిస్తే చేస్తానని ఎన్నికలకు 50 రోజుల ముందు కేసీఆర్‌ చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు చేయలేకపోయారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ‘సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పింఛన్లు ఎందుకు ఇవ్వలేదు.. ఇప్పుడు ఏకకాల రుణమాఫీ అంటున్నారు.. గతంలో మేం అడిగినప్పుడు ఎందుకు చేయలేదు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడగలుగుతాడా.’అని ఉత్తమ్‌ విమర్శించారు. రాష్ట్రంలో 1.6 లక్షల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కట్టిస్తానని చెప్పి రెండేళ్లయిందని, ఇప్పుడు ఐదారువేలు కూడా కట్టియ్యకుండా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. సొంత స్థలం ఉన్న వాళ్లకి తాము ఇళ్లు కట్టిస్తామని చెప్పిన తర్వాత అదే విషయం చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్‌ విజయమని, ఇప్పటికయినా తెలంగాణ ప్రజలకు నిజం తెలిసివచ్చిందని, అన్ని విషయాల్లో కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మరోమారు స్పష్టమయిందని ఉత్తమ్‌ అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాలు ఇస్తానని చెప్పి చేయనందుకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని, గిరిజనులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

నిరంతరం మోసమే
కేసీఆర్‌ లాంటి దగుల్బాజీ, ధోకా మాటలు ఎవరూ మాట్లాడలేదని, ఆయన ఎస్సీ, ఎస్టీలను నిరంతరం మోసం చేశాడని ఉత్తమ్‌ అన్నారు. 64 లక్షల మంది దళితుల్లో మూడు వేల కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చిన మోసగాడు, అబద్ధాల కోరు కేసీఆర్‌ అని, వారికి కూడా పట్టాలిచ్చి, పొజిషన్లు ఇవ్వలేదని అన్నారు. 40లక్షల మంది గిరిజనుల్లో ఒక్కరికి కూడా మూడెకరాల భూమి ఇవ్వకపోగా, చాలా కాలంగా వారు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కున్నాడని ఆరోపించారు. బీసీలకు రూ.20–25వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.7–8 వేల కోట్లను కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్‌భూములు, ఉర్దూ అకాడమీ విషయాల్లో మైనార్టీలను మోసం చేశారని, రైతులను, మహిళా సంఘాలను దగా చేశాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత అత్యంత ఆవేదన, ఆవేశంతో ఉన్నారని, తాను అధికారంలోకి వచ్చే నాటికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్‌ అని అన్నారు. ఉద్యోగులు, టీచర్లకు ఎందుకు పీఆర్సీ ఇవ్వలేదో బహిరంగ ప్రకటన చేసి క్షమాపణచెప్పాలని, ఐఆర్‌ ఎందుకివ్వలేదని, సీసీఎస్‌ రద్దు చేస్తానని స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఒక్క సామాన్యుడిని కలవని దేశంలోని ఏకైక సీఎం కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు సమానమేనని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేసీఆర్‌ బెదిరింపులకు తాము భయపడేది లేదని, ఆయన్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని, డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.
 
తామేం చేస్తామంటే..
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ తీసుకునే చర్యలను ఉత్తమ్‌ వివరించారు. మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంటు ఇస్తామని, ప్రతి గ్రూప్‌నకు రూ.10 లక్షల రుణం బ్యాంకుల నుంచి ఇప్పించి వడ్డీ భారాన్ని తామే భరిస్తామని వెల్లడించారు. సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఆర్పీలు, బీమా మిత్రులకు రూ.10వేల వేతనం ఇస్తామని, అభయహస్తం పునరుద్ధరిస్తామని, బీపీఎల్‌ కుటుంబాలకు రూ.5లక్షల వరకు వైద్యం ఉచితంగా అందేలా ఆరోగ్యశ్రీని మరింత విస్తృతం చేస్తామని, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, రేషన్‌ కింద కుటుంబంలోని ప్రతి మనిషికి 7 కిలోల సన్నబియ్యంతో పాటు ఉప్పు, చక్కెర, నూను, గోదుమపిండి, కారం, చింతపండు లాంటి 9 రకాల నిత్యావసరాలు కూడా ఇస్తామని, సంవత్సరానికి 6 ఎల్పీజీ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, దళితులు, గిరిజనులకు గృహ విద్యుత్‌ కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఉత్తమ్‌ చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top