
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనం గులాబీ జెండా ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన ఈ జిల్లా మళ్లీ టీఆర్ఎస్కే జైకొట్టింది. రాజకీయ ఉద్ధండుల కోటగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారుజోరును కొనసాగించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాలుండగా.. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 చోట్ల విజయఢంకా మోగించింది. గత ఎన్నికల్లో జగిత్యాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే.. ఈసారి అక్కడ ఓడి మంథనిలో గెలిచి తిరిగి ఒక్క స్థానానికే పరి మితం అయ్యింది. రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మిగి లిన 11 స్థానాల్లో గులాబీ గుబాళించింది. 2014 ఎన్నికల్లో ఈ జి ల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాలు దక్కించుకుని ఒకే ఒక్క నియోజకవర్గాన్ని కోల్పోగా.. ఈసారి రెండుస్థానాలను చేజార్చుకుంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరుమంత్రులు ఈసారీ భారీ ఆధిక్యతతో విజయ విహారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొసాగుతున్న మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఈటలకు పోటీగా ప్రజాకూటమి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలోకి దించారు. ఆదినుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన ఈటల రాజేందర్ 43,401 ఓట్లకు పైచిలుకు మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడం ఇది ఆరోసారి. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే. మహేందర్రెడ్డిపై కేటీఆర్ జయకేతనం ఎగురవేశారు.
2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్ 2010 ఉప ఎన్నికతోపాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విజయం సాధించారు. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా హుస్నాబాద్ స్థానం సీపీఐకి కేటాయించగా.. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి చాడ వెంకటరెడ్డి ఓటమి చెందారు. కోరుట్ల నియోజకవర్గంలో తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్రావు విజయం సాధించారు. ఇక్కడ ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ తరఫున జువ్వాడి నర్సింగారావుపై గెలపొందారు. ధర్మపురి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీచేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ తలపడ్డాయి. ఈసారి 441 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో లక్ష్మణ్కుమార్పై కొప్పుల ఈశ్వర్ మరోసారి గెలుపొందారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో తాజామాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ మహాకూటమి తరఫున కాంగ్రెస్ నుంచి చింతకుంట విజయ రమణారావు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పోటీ చేయగా ముక్కోణపు పోటీలో దాసరి గెలుపొందారు. వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబు గెలుపొందారు. తొలుత రమేశ్బాబుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చినా.. చివరకు ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆది శ్రీనివాస్పై విజయం సాధించారు.
ఓటమి చెందిన రాజకీయ దిగ్గజాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్దండులు, సీనియర్లు పలువురు ఈసారి ఓటమి చెందారు. ఇందులో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నేతలూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్ విజయబావుటా ఎగురవేశారు. గత ఎన్నికల్లో కరీంనగర్ మొత్తంలో ఈ ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా టి.జీవన్రెడ్డి గెలిచారు. ఆ సీటును ఈసారి టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం సాగించింది. ఫలితంగా జగిత్యాలలో ఆరుసార్లు గెలిచిన జీవన్రెడ్డి ఈసారి ఓటమిపాలయ్యారు. కరీంనగర్ నియోజకర్గంలో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ప్రజాకూటమి తరఫున బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఓటమి చెందారు.
గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన బండి సంజయ్ తాజా ఎన్నికల్లోనూ రెండోస్థానంలోనే ఉన్నారు. హుస్నాబాద్ నుంచి ప్రజాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్కుమార్ చేతిలో ఓడిపోయారు. మానకొండూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్ ఓటమి చెందారు. రసమయి, ఆరెపల్లి మధ్య పోరు రసవత్తరంగా సాగింది. చొప్పదండి నుంచి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ను వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగ శోభ.. ఒకసారి టీడీపీ, రెండోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మేడిపల్లి సత్యం కూడా ఓటమి చెందారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైంది.
మంథనిలో మాజీమంత్రి.. అసెంబ్లీకి జిల్లానుంచి కొత్తగా ముగ్గురు
మాజీమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంథనిలో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బరిలోకి దిగగా.. ప్రజాకూటమి తరఫున శ్రీధర్బాబు పోటీ చేశారు. మంథని నియోజకవర్గంలో ఈసారి కూడా పాత ప్రత్యర్థుల మధ్యే పోరుజరగ్గా.. గత ఎన్నికల్లో మధుకర్పై ఓటమి చవిచూసిన శ్రీధర్ బాబు ఈసారి విజయం సాధించారు. అలాగే రామగుండంలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్పటేల్ 20వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. చందర్ గతంలో టీఆర్ఎస్లో ఉన్నారు. తాజా ఎన్నికల్లో చందర్కు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి జిల్లా నుంచి కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ లో అడుగుపెట్టనున్నారు. రామగుండం నుంచి ఫార్వర్డ్బ్లాక్ పార్టీ టికెట్పై గెలుపొందిన కోరుకం టి చందర్, చొప్పదండి, జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందిన సుంకె రవిశంకర్, సంజయ్కుమార్ అసెంబ్లీకి వెళ్తున్నారు.
వరుస విజయాలతో ఈటల డబుల్ హ్యాట్రిక్
ఈ ఎన్నికల్లో అరుదైన రికార్డులను టీఆర్ఎస్ నేతలు తమ ఖాతాలో వేసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్లో విజయబావుటా ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అలుపెరుగని గెలుపుతో వరుస విజయాలను తన సొంతం చేసుకున్నారు. 2004లో కమలాపూర్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత అక్కడి నుంచి 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తా చాటారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజా మాజీ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ ఏడోసారి పోటీ చేశారు. ఒకేసారి ఓడిన ఈయన వరుస విజయాలు సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థిగా మారి ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నికల్లో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010(ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు.
నాలుగోసారి గెలిచిన కేటీఆర్, రమేష్బాబు, కేవీఆర్.. హ్యాట్రిక్ వీరుడు గంగుల
ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచిన కేటీఆర్ సిరిసిల్ల ఖిల్లాను పదిలం చేసుకున్నారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే.మహేందర్రెడ్డిపై జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్.. 2010 ఉప ఎన్నికతోపాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు. తాజాగా మరోసారి గెలుపొందిన కేటీఆర్ నాలుగోసారి విజయదుందుభి మోగించారు. వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతోపాటు మంత్రి కేటీఆర్ 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో వరుస గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్రావు 2009లో కోరుట్ల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచిన ఈయన రద్దైన మెట్పల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అన్నారు.
దుద్దిళ్ల శ్రీధర్బాబు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన ఈ ఎన్నికల్లో ఐదోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ నాలుగోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2009లో టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల కమలాకర్ 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి పోటీచేసి హాట్రిక్ కొట్టారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ఓటమి ఎరగని నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు. రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. మేడారం నుంచి ఒకసారి.. ధర్మపురి నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ఈ ఎన్నికల్లో ఆఖరి నిముషంలో దురదృష్టం వెంటాడింది. ఫలితంగా 441 ఓట్ల స్వల్ప తేడాతో మళ్లీ ఓటమి పాలయ్యారు.