27న కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ | TRS plenary in Kampalle on 27 | Sakshi
Sakshi News home page

27న కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

Apr 9 2018 3:08 AM | Updated on Apr 9 2018 3:08 AM

TRS plenary in Kampalle on 27 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని హైదరాబాద్‌ శివారులోని కొంపల్లిలో నిర్వహించనున్నట్లు మండలిలో ప్రభుత్వ విప్, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న నిర్వహించే ప్లీనరీకి సంబంధించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కొంపల్లిలోని జీబీఆర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయించినట్లు వివరించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 150 మంది చొప్పున 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ రంగాలపై చర్చ, తీర్మానాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చ, తీర్మానాలు ఉంటాయని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో తీర్మానాల కమిటీని కేసీఆర్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మిగతా కమిటీలను కూడా త్వరలో ప్రకటిస్తారని, అక్టోబర్‌ లేదా నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తామని, ఈ సభకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరూ హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement