కొనసాగుతున్న కక్ష సాధింపు | Summoned To Kotam Reddy Sridhar In Cricket Betting | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కక్ష సాధింపు

Apr 26 2018 11:38 AM | Updated on Apr 26 2018 11:38 AM

Summoned To Kotam Reddy Sridhar In Cricket Betting - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసులు కక్ష సాధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో విచారణకు హాజరుకాలేదనే కారణంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అది కూడా366 రోజుల పాదయాత్రకు ఒక్కరోజు ముందుగా. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 14న కోర్టుకు హాజరుకావాలని..
 నెల్లూరు రెండో నగర పోలీస్‌స్టేషన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు కృష్ణసింగ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కృష్ణసింగ్‌తో పాటు మరికొందరు బుకీలను ఎమ్మెల్యే ప్రోత్సహించినట్లు వారికి సహకరించనట్లు, వారితో లావాదేవీలు నిర్వహించినట్లు తగిన ఆధారాలు సేకరించి ఎమ్మెల్యేకు రెండు పర్యాయాలు నోటీసులు ఇస్తే ఆయన విచారణకు నిరాకరించిన కారణంగా బుధవారం కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా వచ్చే నెల 14వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఇతరులకు సమన్లు జారీ చేశారని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తును ఏసీబీ అధికారులు నిర్వహిస్తారని కేసును వారికి అప్పగించినట్లు ప్రకటనలో వివరించారు.

న్యాయపోరాటంతోనే ఎస్పీ డొల్లతనంబయటపెడతా
పోలీసులు తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతున్నారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. న్యాయ పోరాటంలోనే జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ డొల్లతనం బయటపెడతానన్నారు. తనపై అక్రమ కేసులో కుట్రలో ఉన్న మంత్రులు, పోలీసు పెద్దలు అందరి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. తానే గతంలో ఈ అక్రమ కేసును సీబీఐ, సీఐడీ లేదా ఏసీబీకి ఇవ్వాలని డిమాండ్‌ చేశానన్నారు. అక్కడ తాను, ఎస్పీ రామకృష్ణ ఇద్దరు వివరణలు ఇవ్వాలని, దీనికి తాను సిద్ధంగా ఉన్నానని ఎస్పీ సిద్ధంగా ఉన్నారా అని గతంలోనే ప్రశ్నించానని చెప్పారు. 2017లో అగస్టులో స్వయంగా జిల్లా పోలీస్‌ బాస్‌ ఈ కేసులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ప్రకటించారు. కానీ తర్వాత రాజకీయ కక్షతో  నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఇచ్చారని మళ్లీ రెండో పర్యాయం 8 నెలల తర్వాత రాజ్యసభ ఎన్నికల సమయంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చారని వివరించారు.

ఇప్పుడు 366 రోజుల పాదయాత్ర షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత పాదయాత్రకు ఒక్కరోజు ముందు కోర్టు సమన్లు ఇచ్చిందని పోలీసులు ప్రకటించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో పోలీస్‌ పెద్దల డైరక్షన్‌లో తనపై కుట్ర జరగుతుందని మండిపడ్డారు. తాను నిత్యం జనాల్లో ఉంటూ ప్రతి నిమిషం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటుండగా పోలీసులు మాత్రం తాను అజ్ఞాతంలో ఉన్నట్లు చార్జీషీటులో పేర్కొనటం అత్యంత దారుణం అన్నారు. చార్జీషీటులో ఒక రకంగా పత్రికలకు ఒక రకంగా చెబుతూ జిల్లా ఎస్పీ మైండ్‌గేమ్‌  అడుతున్నారని,  పూర్తి ఆధారాలతో పోలీసుల డొల్లతనాన్ని బయటపెడతానని, ఇలాంటి అక్రమ కేసులకు తానేమీ భయపడనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement