‘ద్రోహులు నిర్మించిన కట్టడాలను కూలగొట్టండి’
సాక్షి, లఖ్నవూ(ఉత్తరప్రదేశ్): సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బానిసత్వానికి ప్రతీకలుగా ఉన్న పార్లమెంట్ భవనాన్ని, రాష్ట్రపతి భవనాలను కూలగొట్టాలని కోరారు. భారతీయ సాంస్కృతిక సంపదలో తాజ్మహల్ భాగం కాదంటూ బీజేపీ నేత సంగీత్ సోం చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. బానిసత్వానికి మారు రూపుగా ఉన్న అన్ని కట్టడాలను ధ్వంసం చేయాలన్నారు.
‘మొగలాయీలు భారతదేశాన్ని ఆక్రమించుకున్నది నిజమే. వారు ఎలా వచ్చారు ? ఎవరు తీసుకువచ్చారు ? అనే విషయాలను నేను ప్రస్తావించదలుచుకోలేదు. అది మరో పెద్ద దుమారానికి దారితీస్తుంది. కొందరికి ఇలాంటి నిజాలు నచ్చవు’ అని ఆయన అన్నారు. ద్రోహులు నిర్మించిన కట్టడాలైన పార్లమెంట్, రాష్ట్రపతి భవనాలను ముందుగా బాద్షా, యంగ్ బాద్షా(ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్లను ఉద్దేశించి)లను కూలగొట్టనివ్వండి. తర్వాత తాజ్మహల్ జోలికి వెళ్లండి అని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు