వైఎస్సార్ సీపీలో శరగడం చేరిక
చినఅప్పలనాయుడు బాటలో
మరికొంత మంది టీడీపీ నేతలు
విశాఖపట్నం, పెందుర్తి : నగర పరిధిలోని పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శరగడంకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో శరగడం చిన అప్పలనాయుడుతో పాటు ఆయన తనయుడు డాక్టర్ పవన్భరత్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధినేతతో చర్చించారు. టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శరగడం శనివారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్సీపీలోకి వందలాది కుటుంబాలు!
పెందుర్తి పట్టణంలో క్షేత్రస్థాయిలో పేద, బడుగు బలహీన వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న శరగడం చేరికతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతమైంది. గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆయన 71వ వార్డు కార్పొరేటర్గా గెలిచారు.ఆయన వెంట మరింత మంది వైఎస్సార్ సీపీలో చేరే అవకాశం ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో అవినీతికి, వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీలో ఇమడలేక చాలామంది సీనియర్ నాయకులు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు అప్పలనాయుడుల నిరంకుశ వైఖరి టీడీపీ పాతకాపులకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే కొద్దిరోజుల్లో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని స్థానికంగా చర్చ నడుస్తోంది.
జగన్ను సీఎం చేసుకుంటాం: శరగడం
రానున్న ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తామని శరగడం చిన అప్పలనాయుడు తెలిపారు. వైఎస్ జగన్లో తన ప్రియతమ నాయకుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట పూటకో డ్రామాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్తో కలిసి పనిచేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు.పెందుర్తిలో నాయకులందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీని మట్టి కరిపించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు.