మోత్కుపల్లిపై ‘సండ్ర’ నిప్పులు..!

sandra venkata veeraiah comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ పనైపోయిందని వ్యాఖ్యానించిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరోక్షంగా మండిపడ్డారు. కొంత మంది స్వార్ధపరుల కోసమో, పదవుల కోసమో, అవకాశవాదుల కోసమో టీడీపీని స్థాపించలేదని అన్నారు. కొంతమంది నాయకులు అవకాశం కోసం పార్టీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృతనిశ్చయంతో ఉండటమే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని పేర్కొన్నారు.

తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందని, పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయటం మంచిదని సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని మోత్కుపల్లి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని వీరయ్య పరోక్షంగా పేర్కొనడంతో టీటీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడినట్టయింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని నారా లోకేశ్‌ ప్రకటించారు. ‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top