ఫలితాలపై స్పందించిన రామ్‌ విలాస్‌ పాశ్వన్‌

Ram Vilas Paswan Mocks Congress After Poll Drubbing - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్ని ఏకమైనప్పటికి ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించింది. ప్రధానిగా మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు రామ్‌ విలాస్‌ పాశ్వన్‌ ఫలితాలపై స్పందిస్తూ.. ‘2019లో ప్రధాని పీఠం ఖాళీగా ఉండదని గత మూడేళ్ల నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ కాంగ్రెస్‌ పార్టీ నా సూచనను పట్టించుకోలేదు. ఈ ఐదేళ్లు వారు ప్రధాని పీఠం కోసం కాకుండా ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కృషి చేస్తే బాగుండేది. ఈ సారి కూడా కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా నిలవలేకపోయింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 52 సీట్లకే పరిమితమయ్యింది’ అని ఎద్దేవా చేశారు.

అంతేకాక అమేథీలో స్మృతి ఇరానీ.. రాహుల్‌ గాంధీ మీద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్మృతి ఇరానీకి, రామ్‌ విలాస్‌ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బిహార్‌లో ఏ పార్టీ లేదని... ఏ నాయకుడు లేడని అన్నారు. అన్ని పార్టీలను ప్రజలు మట్టి కరిపించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, ఉన్నత వర్గం వారు అందరూ బీజేపికే ఓటు వేశారని తెలిపారు. కులతత్వాన్ని బీజేపీ బ్రేక్‌ చేసిందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలంటే మొత్తం సీట్లలో కనీసం 10 శాతం స్థానాల్లో విజయం సాధించాలి. ఈ లెక్కన 55 స్థానాల్లో గెలుపొందిన పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 52 సీట్లకే పరిమితమయ్యింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top