
సాక్షి, చెన్నై : కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోను దేశ భద్రతకు భంగం కలగకూడదన్నారు. ఏయే విషయాల్లో రాజకీయాలు మాట్లాడాలనేది నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. తమిళ సినిమాలకు జాతీయ అవార్డులు రాకపోవడం బాధాకరమని అన్నారు. అయితే ఈ సందర్భంగా తమిళ రాజకీయాల్లో మళ్లీ పోయెస్ గార్డెన్ కీలక భూమిక పోషిస్తుందనే ప్రశ్నకు ఆయన వెయిట్ అండ్ సీ అంటూ సమాధానమిచ్చారు. కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉన్న పోయోస్ గార్డెన్ ప్రాంతంలోనే రజనీ నివాసం ఉన్న సంగతి తెలిసిందే
సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఆర్టికల్ 370, కశ్మీర్ విభజన అంశాల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. అయితే రజనీ ఈ విధంగా మాట్లాడంపై కాంగ్రెస్తోపాటు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం ఆయన అత్తివరదరాజు స్వామి వారిని దర్శించుకున్నారు.