ఏడుపదుల వయసు దాటినా వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న నటుడు రజనీకాంత్. నిజం చెప్పాలంటే ఇటీవల మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. జైలర్ చిత్రం మినహా మంచి సక్సెస్ కాలేదు. రజనీకాంత్ ఈ మధ్య కాలంలో నటించిన వేట్టయన్, కూలీ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా ఈయన వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.
ప్రస్తుతం జైలర్–2 చిత్రాన్ని పూర్తిచేసిన రజనీకాంత్ తాజాగా ఆయన 173వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సహనటుడు కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించడం విశేషం. దీనికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కడుతున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్కు జంటగా నటించే కథానాయకి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలో ఇతర భాషలకు చెందిన ప్రముఖ తారలు నటించడం ఆనవాయితీగా మారింది. మరి ఇందులోనూ అలాంటి నటీనటులు నటించే అవకాశం లేకపోలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇందులో నటి పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ నటించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది.
అయితే ఈ ముద్దుగుమ్మలు సహజంగా పోషించే గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. వీటితోపాటు ఒక సీనియర్ నటి కూడా నటించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది.


