మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో టాలీవుడ్లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సౌబిన్ షాహిర్. అతడు గతేడాది పోలీస్గా నటించిన థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి. రతీనా పీటీ దర్శకత్వం వహించిన ఈ మలయాళ మూవీ 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం...
కథేంటి?
పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే కేసుల్ని పోలీసులు ఎలా చేధిస్తారనేది చూపిస్తారు. అయితే ఈ మూవీలో మాత్రం కాస్త విభిన్నంగా తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించారు. అదే సమయంలో తమ తప్పు లేదని నిరూపిస్తూనే కేసును చేధిస్తారు. పాతిరాత్రి అంటే అర్ధ రాత్రి అని అర్థం. ఆ కటిక చీకటిలో ఏం జరిగిందనేదే సినిమా.
ఎలా ఉంది?
ఓపెనింగ్ షాట్తో సినిమాలో ఏదో విశేషం ఉండబోతుందని హింట్ ఇచ్చారు. తీరా చూస్తే మరీ అంత హైప్ ఇచ్చే మూమెంట్స్ ఏవీ ఉండవు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కొంత బోరింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తి పుంజుకుంటుంది. సెకండాఫ్లో స్పీడ్ పెరుగుతుంది. ప్రముఖ జర్నలిస్టు మరణం కేసులో కానిస్టేబుల్ హరీశ్ (సౌబిన్ షాహిర్), ఎస్ఐ జాన్సీ (నవ్య నాయర్) సస్పెండ్ అవుతారు.
అక్కడి నుంచి వారు కేసులో అసలు హంతకులెవరో నిరూపించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో వెలుగుచూసే నిజాలు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, విచారణ మాత్రం మరీ అంత ఆసక్తికరంగా సాగదు. అయితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు పాతిరాత్రిని ఒకసారి చూసేయొచ్చు. ప్రస్తుతం జీ5లో ఉన్న ఈ సినిమా మలయాళ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. (Paathirathri Movie Review)


