
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బీజేపీపై ట్వీట్ దాడుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా పాలక పార్టీని అవాస్తవాలను మలిచే అబద్ధాల ఫ్యాక్టరీగా అభివర్ణించారు. ఫేస్బుక్ డేటా ఉల్లంఘనల వివాదం, భారత రాజకీయాల్లో కేంబ్రిడ్జి అనలిటికా పాత్రకు సంబంధించి రాహుల్ బీజేపీని టార్గెట్ చేశారు. 2012లో కాంగ్రెస్కు ద్రోహం చేసేందుకు కేంబ్రిడ్జ్ అనలిటికాకు చెల్లింపులు ఎలా జరిగాయనే కథనం సిద్ధమవుతుండగా..కాంగ్రెస్ కేంబ్రిడ్జ్తో కలిసి పనిచేసిందని అవాస్తవాలను ప్రచారం చేసేలా బీజేపీ కేబినెట్ మంత్రిని పురమాయించిందని రాహుల్ ట్వీట్ చేశారు.
డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ అనలిటికా సేవలను ఉపయోగించుకున్నారని బీజేపీ, కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆ కంపెనీ సేవలను వాడుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీయే ఆ కంపెనీల సేవలను వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకుందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.