విప్లవ్‌ యవ్వారం.. రంగంలోకి మోదీ | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 8:12 AM

PM Modi Summoned Biplab Kumar Dev - Sakshi

అగర్తలా: వివాదాస్పద వ్యాఖ్యలతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. సోషల్‌ మీడియాలో విప్లవ్‌, బీజేపీలను విపరీతంగా ట్రోల్‌ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో విప్లవ్‌కు నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. విప్లవ్‌ను తన ఎదుట హాజరుకావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. 

మే 2న విప్లవ్‌ను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించినట్లు సీనియర్‌ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. తన వ్యాఖ్యలపై ఆయన వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పీఎంవో కార్యాలయం కూడా సమన్లు జారీ చేసిన విషయాన్ని ధృవీకరించాయి. కాగా, గత నెలలో త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. 

మహాభారత కాలంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్‌ వరల్డ్‌ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్‌ సర్వీసెస్‌కు సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్‌ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్‌ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస తన వ్యవహార శైలితో ఆయన మీడియాలో రోజు నిలుస్తున్నారు.

Advertisement
Advertisement