కాంగ్రెస్‌ గూటికి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి! | Onteru Pratap Reddy Into Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి!

May 17 2018 10:24 AM | Updated on Mar 18 2019 9:02 PM

Onteru Pratap Reddy Into Congress  - Sakshi

గౌరారం రిసార్టులో ఒంటేరుతో దామోదర రాజనర్సింహ, ముత్యంరెడ్డిలు భేటీ అయిన దృశ్యం 

సాక్షి, సిద్దిపేట : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధంలో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నట్లు దాదాపు ఖరారైంది. ఈ మేరకు బుధవారం సిద్దిపేట జిల్లా గౌరారంలోని ఓ రిసార్టులో కాంగ్రెస్‌ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో  ప్రతాప్‌రెడ్డి చర్చలు జరిపారు.

ఈ నెల 21న ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. టీడీపీకి రాజీనామా చేసిన ఒంటేరు.. వారంరోజులుగా ఏ పార్టీలో చేరకుండా సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారా? లేక కోదండరామ్‌ పార్టీలో చేరతారా? వీటిని కాదని టీఆర్‌ఎస్‌ గూటికి చేరతారా? అనేది సర్వత్రా చర్చగా మారింది. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న నాయకులు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.

ఇటీవల పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిగతా నాయకులు ఆయనతో ఫోన్‌లో సంప్రదించినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా బుధవారం గౌరారంలోని ఓ రిసార్టులో వీరంతా భేటీ అయ్యారు. అక్కడి నుంచి పీసీసీ చీఫ్‌తో ఫోనులో మాట్లాడారు. ఆయన పార్టీలో చేరితే లాభనష్టాలు, ఇచ్చే ప్రాధాన్యం తదితర అంశాలను చర్చించారు. ఈ మేరకు పీసీసీ చీఫ్‌తో హామీ కూడా తీసుకున్నట్లు తెలిసింది.

అదేవిధంగా ఈ నెల 21న ఢిల్లీలో రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆయన సమక్షంలో ‘ఒంటేరు’ తమ అనుచరులతో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఒంటేరు చేరికపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement