ఉద్యమంలో ఉత్తమ్‌ ఆచూకీ లేదు: నాయిని

Naini Narshimha Reddy comments on Uttamkumar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విలీనం, విమోచనం గురించి మాట్లాడే అర్హత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్తమ్‌ ఆచూకీ లేదని.. ఉద్యమంలో ఆయన ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. హైదరాబాద్‌ సంస్థాన విలీన దినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో నాయిని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపడం లేదని అమిత్‌ షా ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేక పారిపోయారు.

అమిత్‌ షా తెలం గాణలో గెలుస్తాం అని షో చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అమిత్‌ షాకు తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ సమయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. మాది సెక్యులర్‌ పార్టీ. మైనార్టీల పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాం. తెలంగాణ ఇవ్వొద్దని కాంగ్రెస్‌ వాళ్లు నిజాం కాలేజీలో సభ పెట్టారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ద్రోహులు.

మిగతా పార్టీలు మహాకూటమితో ప్రజల వద్దకు వెళ్తామంటున్నాయి. వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు రావడం ఖాయం. చంద్రబాబు తెలంగాణ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు. టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలపడాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరు. అభివృద్ధి విషయంలో తెలంగాణ, దేశంలోనే ముందు ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అది కొనసాగుతుంది’ అని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top