వచ్చేది మా ప్రభుత్వమే!

muralidhar rao about bjp - Sakshi

బీజేపీ నేత పి.మురళీధర్‌రావు

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. నగర బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ అమీర్‌పేటలో జరిగిన నిరుద్యోగుల యువగర్జనలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిని పారదోలి పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు, భూ దందాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాత కాంగ్రెస్, టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారిని పక్కన పెట్టిందన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బీజేవైఎం నడుం బిగించిందన్నారు.

అధికారంలోకి వస్తే 3,000 నిరుద్యోగ భృతి: లక్ష్మణ్‌
తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయకర్తలుగా గులాబీ దళాలను నియమించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ గాలిమోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెప్పడం మాను కుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

2019లో తాము అధికారంలోకి వస్తే రూ.మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. నగర బీజే వైఎం అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్, నగర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top