వేధిస్తున్న బాలయ్య పీఏ | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న బాలయ్య పీఏ

Published Tue, Sep 25 2018 11:07 AM

MLA Balakrishna PA Harassments On TDP Leaders Anantapur - Sakshi

అనంతపురం, హిందూపురం అర్బన్‌: గ్రూపు రాజకీయాలతో కొందరికే ప్రాధాన్యతనిస్తూ మరికొందరిని ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ వీరయ్య వేధిస్తున్నారంటూ చిలమత్తూరు టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ నారాయణ, మండల మాజీ కన్వీనర్‌ బాబురెడ్డి, శెట్టిపల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్, రామచంద్రారెడ్డి, మధుశేఖర్‌రెడ్డి సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులందరి సమక్షంలో బాబురెడ్డిని పార్టీ మండల కన్వీనర్‌గా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.

అయితే వీరయ్య తనకు అనుకూలంగా ఉన్న రంగారెడ్డిని కన్వీనర్‌గా ప్రకటించి పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. 2014లో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ గెలుపునకు అప్పుడు కన్వీనర్‌గా ఉన్న రంగారెడ్డి కృషి చేయకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికాడని గుర్తు చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి మండల బాధ్యత అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంగా పీఏను అడిగితే రంగారెడ్డి చెప్పిందే చేయాలంటూ నిబంధనలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా రుణాల మంజూరులోనే అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించుకుని పంచాయితీలు చేస్తూ అభివృద్ధి పనులు కట్టబెడుతున్నారన్నారు. పీఏ వీరయ్య విషయంపై బాలయ్యకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

1/1

మాట్లాడుతున్న చిలమత్తూరు టీడీపీ నాయకులు

Advertisement
Advertisement