బాబుకు లోకేష్‌ భయం పట్టుకుంది

Minister Botsa Satyanarayana Fires On TDP - Sakshi

మండలిలో ప్రజాతీర్పుని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు

మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎలా దొరికిపోయారో ప్రజలు చూశారు

టీడీపీ ఎమ్మెల్సీలకు రూ.5కోట్లు, రూ.10కోట్లు ఎందుకిస్తాం.?

చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా?

చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మంత్రి బొత్స

సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే శాసన మండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన బొత్స.. మండలి అవసరమా అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోందన్నారు. శాసన మండలి నిబంధనలకు తూట్లు పొడిచిందని బొత్స చెప్పారు. కొందరు రాజకీయ లబ్ది కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం 5 కోట్ల మంది లబ్ది కోసం పని చేస్తోందన్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నారని 'ఈనాడు'లో తప్పుడు కథనాలు రాస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. 1983లో టీడీపీకి బలం లేనప్పుడు ఎలా వ్యవహరించారో ఆయన గుర్తు చేశారు. మండలి రద్దుకు అంకురార్పణ చేసినప్పుడు రామోజీరావు సమర్థించారని చెప్పారు. ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలను రామోజీరావు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.

మండలిలో నిబంధనలను తుంగలో తొక్కడం రామోజీరావుకి కనపడట్లేదా? అని బొత్స నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీలకు రూ.5కోట్లు, రూ.10కోట్లు ఎందుకిస్తాం.? వాళ్లేమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా..?  చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా? మండలి రద్దయితే లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని, ఎందుకంటే లోకేశ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని అన్నారు. స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవని బొత్స అన్నారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. సూచనలు చేయాల్సిన మండలి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు.

శాసన మండలిలో ప్రజాతీర్పుని అపహాస్యం చేశారని బొత్స వాపోయారు. రాజ్యాంగానికి మండలిలో తూట్లు పొడవడంపై సీఎం జగన్ ఆవేదన చెందారని బొత్స చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికిపోయారో.. టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో ప్రజలు చూశారని బొత్స అన్నారు. చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లలాంటి వారని చెప్పారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశామని, ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయాడో చూశామని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే వైఎస్సార్‌సీపీకి తెలుసని బొత్స సత్యనారాయణ అన్నారు.

(ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే)

చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top