ప్రజా సొమ్ము దోపిడీకే ప్రాజెక్టు్టల రీడిజైన్: మర్రి
సాక్షి, హైదరాబాద్: ప్రజల సొమ్మును దోచుకునేందుకే సాగునీటి ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ రీడిజైన్ చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి శుక్రవారం ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ కారణంగా జాతీయహోదా వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు.
గతంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాను కల్పించాలని కోరిన టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఇప్పడు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాను ఎందుకు కోరడం లేద ని ప్రశ్నించారు. 2018–19 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీ గా ఉండటం మంచిది కాదని, వెంటనే అధ్యక్షుడిని నియమించాలని కోరారు.