అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ | Maharashtra Not Needed Khichdi Govt, says Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ

Nov 23 2019 9:46 AM | Updated on Nov 23 2019 3:04 PM

Maharashtra Not Needed Khichdi Govt, says Devendra Fadnavis - Sakshi

అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌

మహారాష్ట్రలో బీజేపీతో జత కట్టడంపై ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ వివరణయిచ్చారు.

సాక్షి, ముంబై: మహారాష్ట్రకు కావాల్సిం​ది సుస్థిరమైన ప్రభుత్వమని, కిచిడి ప్రభుత్వం కాదని దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమ బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన మాట తప్పిందని ఆరోపించారు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నించడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఎన్సీపీతో కలిసి సుస్థిర పాలన అందిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర పాలన ఏర్పాటుకు తమతో కలిసి వచ్చిన అజిత్‌ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరికొంత మంది నాయకులు కూడ తమతో చేతులు కలపడంతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని ఫడ్నవీస్‌ వెల్లడించారు.

రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. రైతులతో సహా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఏర్పాటైతేనే ఈ సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో బీజేపీతో చేతులు కలిపామ’ని అజిత్‌ పవార్‌ వివరించారు. అయితే శరద్‌ పవార్‌ ఈ నిర్ణయాన్ని ఆమోదిందారా, లేదా అనేది ఆయన వెల్లడించలేదు. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?)

Advertisement
 
Advertisement
Advertisement