బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్‌ పాగా

Maha Vikas Aghadi Wins Majority Seats In Zilla parishad Elections - Sakshi

రాష్ట్రంలోని ఆరు జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు విడుదల 

భారీ ఆధిక్యంతో కమలానికి షాక్‌ ఇచ్చిన మహావికాస్‌ ఆఘాడీ

సాక్షి ముంబై : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఆరు జిల్లా పరిషత్‌లలో నాలుగు జిల్లాల్లో మహావికాస్‌ ఆఘాడి విజయ ఢంకా మోగించింది. మాజీ ముఖ్యమంత్రి దేశ్‌ముఖ్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీల ప్రాంతమైన విదర్భలోని నాగ్‌పూర్, నందుర్బా, వాశీం జిల్లాల్లో బీజేపీకి పరాజయం చవిచూడాల్సివచ్చింది. మరోవైపు పాల్ఘర్‌ జిల్లాలో కూడా మహావికాస్‌ ఆఘాడి విజయం సాధించగా అకోలా జిల్లాలో మాత్రం ఎవరికీ పూర్తి మెజార్టీ రాలేదు. అయితే ధులేలో మాత్రం బీజేపీ పూర్తి మెజార్టీతో విజయం సాధిం చి మహావికాస్‌ ఆఘాడిని ఖంగు తిన్పించింది. (ఉద్ధవ్‌కు చెక్‌.. రాజ్‌ఠాక్రే సరికొత్త వ్యూహం..!)
 
ఫడ్నవిస్‌ ఇలాకాలోనూ.
రాష్ట్రంలోని పాల్ఘర్, నాగ్‌పూర్, ధులే, నందుర్బార్, అకోలా, వాషీం జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగిన సంగతి తెలిసిందే.  రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రికృతమైంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. ఎంతో ఉత్కంఠతగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో బీజేపీకి ఓటర్లు షాక్‌ నిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీల సొంత జిల్లా నాగ్‌పూర్‌లో బీజేపీ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. బీజేపీకి పెట్టని కోటగా ఉన్న నాగ్‌పూర్‌ జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌ పాగా వేసింది. నాగ్‌పూర్‌ జిల్లా పరిషత్‌లోని మొత్తం 58 స్థానాల్లో కాంగ్రెస్‌ 30, ఎన్సీపీ 10, శివసేన ఒక స్థానం దక్కించుకున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం కేవలం 15 స్థానాలతో సంతృప్తి పడాల్సివచ్చింది. మరోవైపు ఇండిపెండెంట్, శేత్కరీ కామ్‌గార్‌ పార్టీలు చెరొక స్థానం దక్కించుకున్నాయి. (శివసేనకు చెక్‌.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!)

కలసి.. విడిపోయి 
గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక మాదిరిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. ఊహించని ట్విస్ట్‌లతో ప్రజలతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలను ఆయోమయంలో పడేశాయి. 2019లో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  శివసేన, బీజేపీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీలు, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఫలితాలు శివసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 శివసేనకు 56 ఇలా పూర్తి మెజార్టీ లభించింది. అయితే ఫిఫ్టీ–íఫ్టీ మార్పుల ఒప్పందంతో విబేధాలు ఏర్పడ్డాయి. ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ శివసేన, బీజేపీలు విడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహావికాస్‌ ఆఘాడీగా ఏర్పడి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమితోనే జిల్లా పరిషత్‌ ఎన్నికలకు మహావికాస్‌ ఆఘాడీ వెళ్లింది. భారీ మెజారిటీ సాధించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top