కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

KTR invites congress MLA Sridhar Babu for Chai In Assembly Lobby - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ  ప్రత్యేక సమావేశాల సందర్భంగా  గురువారం అసెంబ్లీ లాబీలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పద్మా దేవేందర్‌ రెడ్డి, బాల్క సుమన్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఎదురయ్యారు. కేటీఆర్‌ ఈ సందర్భంగా ఛాయ్‌ తాగుదాం రండి అంటూ శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. ‘మీతో ఛాయ్‌పై చర్చనా ? ఇంకా ఏమైనా ఉందా ? వద్దు బాబు’ అంటూ శ్రీధర్‌ సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. అనంతరం బాల్క సుమన్‌ను పలకరించిన శ్రీధర్‌బాబు..ఏదో వన భోజనాలు పెట్టించినట్టున్నావు అని చమత్కరిస్తూ... కాళేశ్వరం జలజాతర పేరిట సుమన్‌ నిర్వహించిన కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. తానే కాదని, మంథని నియోజకవర్గంలో కూడా గతంలో భోజనాలు పెట్టించారని బాల్క సమాధానమిచ్చారు.

ఇక ఇవాళ ఉదయం శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సభాపతి స్థానం నుంచి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా శాసనసభ్యులు జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శాసనసభ సమావేశాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుఛ్చం అందజేసి స్వాగతం పలికారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా రావు గౌడ్‌కు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top