రాహుల్‌తో కోమటిరెడ్డి, సంపత్‌ భేటీ

Komatireddy And Sampath Kumar Meets Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ శుక్రవారం భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిద్దరితో రాహుల్‌  సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను ఈ సందర్భంగా వివరించారు.

అంతకు ముందు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌ను కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివరించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ...‘అక్రమంగా తమ సభ్యత్వాన్ని రద్దు గురించి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్‌కు వివరించాం. అసెంబ్లీకి, స్పీకర్‌కు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రి సభ్యత్వాలను రద్దు చేసి, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ కుతంత్రాలను కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంది.

ఈ కేసుకు సంబంధించి మొత్తం సమాచారన్ని లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. టీఆర్ఎస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 15 లక్షలమందిని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. కక్ష సాధింపు కోసం సభ్యత్వాలను రద్దు చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు తీసుకు రావాలనే కేసీఆర్‌ చేసిన గుణాత్మక మార్పులు ఇవేనా. నీకు పోటీగా వస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తావా?. హైకోర్టు తీర్పును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. సానుకూలంగా స్పందించింది.’ అని తెలిపారు. కోమటిరెడ్డి, సంపత్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి, న్యాయవాది  జంధ్యాల రవిశంకర్ కూడా ఈసీని కలిసినవారిలో ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top