కోదండరాం కొత్త పార్టీ టీజేఎస్‌ జెండా ఇదే.. | Kodandaram Hoisted New Flag Of Telangana Jana Samithi Party | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌ గడీ పగలగొడతాం: కోదండరాం

Apr 4 2018 3:10 PM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram Hoisted New Flag Of Telangana Jana Samithi Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామిక స్పూర్తికి విరుద్ధంగా కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు. నిర్బంధాలను సహించబోమని, ప్రగతి భవన్‌ గడీని పగలగొడతామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పాలకులపై నిప్పులుచెరిగారు.

మేమేంటో చూపిస్తాం: ‘‘ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిపాలన నడుస్తున్నది. తెలంగాన పౌర సమాజమంతా మావైపే ఉంది. మేమేంటో, మా బలమేంటో అతిత్వరలోనే చూపిస్తాం. ఏప్రిల్‌ 29న ఆవిర్భావ సభలో అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతా. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ జన సమితి పార్టీ సామాజిక న్యాయమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికే పార్టీలో చోటు కల్పిస్తాం’’ అని కోదండరాం స్పష్టం చేశారు.

పార్టీ జెండా ఖరారు: ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించిన దరిమిలా ఏప్రిల్‌ 2న తెలంగాణ జన సమితి పార్టీని అధికారికంగా ప్రకటించిన కోదండరాం.. నేడు జెండాను ఆవిష్కరించారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో.. నీలివర్ణపు తెలంగాణ పటం, అమరుల స్థూపంను ఉంచి ఆకట్టుకునేలా రూపొందించారు. సంబంధిత వివరాలన్నీ ఏప్రిల్‌ 29న జరిగే బహిరంగ సభలో వివరిస్తానని కోదండరాం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement