కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా బలం గట్టిగానే

Jyotiraditya Scindia Impact In New Cabinet Oath At Madhya Pradesh Government - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్‌ అడిషనల్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌  గురువారం ఉదయం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన సింధియా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో తన వర్గీయులకు పదవులు దక్కించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సింధియా వర్గంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు సిందియా అత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సింధియాలు ఉన్నారు. (ముగ్గురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు)

కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్‌ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం ​తలెత్తింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్‌ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది. దీనికి తోడు లాక్‌డౌన్‌ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా గురువారం 28 మంది మంత్రులు ‍ప్రమాణం చేయడంతో శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వంలో పూర్తి కేబినెట్‌ కొలువు దీరినట్లయింది.  (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top