మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక

Jana Sena MLA Rapaka Varaprasad Full Support to Three Capitals - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని ఒకేచోట కేంద్రీకృతమైతే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని, ఈ నేపథ్యంలో 13 జిల్లాలూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై రాపాక మాట్లాడారు. 

ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, మన ఆదాయాన్ని సైతం హైదరాబాద్‌ అభివృద్ధికి వెచ్చించారని, కనీసం అప్పుడు వెనుకబడిన జిల్లాలను పట్టించుకోలేదని రాపాక పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మనం తిరిగొచ్చాక ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజల వలస వెళ్తూ రాష్ట్రమంతా పనిచేస్తున్నారని, తినడానికి సరైన తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో కడుపునిండా తిండి కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. వైజాగ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే.. అక్కడి వలసలు ఆగుతాయని, అదేవిధంగా కర్నూలులో జ్యుడీషియల్‌ రాజధాని ద్వారా అనంతపురం ప్రజలు బెంగళూరు వలస వెళ్లడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రతిపక్షం కూడా ఆలోచించాలని కోరారు. అమరావతిలో జరిగిన అవినీతి గురించి బుగ్గన వివరంగా చెప్పారని, దీంతో  అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎంత మోసం జరుగుతుందో ప్రజలకు కూడా తెలిసిందన్నారు. తనకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పడాన్ని స్వాగతించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిననాటి నుంచి వరుసగా పథకాలు అమలుచేస్తున్నారని, అమ్మ ఒడిలాంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇవ్వడం ఒక చరిత్ర అని ప్రశంసించారు. ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథం, నిరంతరం ప్రజల కోసం ఆలోచన ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజల జీవితాల్లో వెలుగునింపడం కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులకు రాష్ట్రంలోని ప్రతిచోటా మద్దతు లభిస్తోందని, ప్రజాభిప్రాయం మూడు రాజధానులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుకు తన తరఫున, జనసేన తరఫున రాపాక పూర్తి మద్దతు తెలియజేశారు.

చదవండి:

రాజధానులు ఎంతెంత దూరం

శాసనాలు చేసే రాజధానిగా అమరావతి

రాజధాని రైతులకు వరాలు

72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...

స్పీకర్‌ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం

ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?

భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన

అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top