టీడీపీ పోటీ.. వైఎస్సార్‌ సీపీ అదృష్టం : వైఎస్‌ జగన్‌ | It Will Be Treated As Luck If TDP Contests In Bypolls Says YS Jagan | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలు : టీడీపీ పోటీ.. వైఎస్సార్‌ సీపీ అదృష్టం..

Jun 6 2018 5:21 PM | Updated on Jul 26 2018 7:17 PM

It Will Be Treated As Luck If TDP Contests In Bypolls Says YS Jagan - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

మోర్తా, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సెల్యూట్‌ చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా మోర్తాలో కొనసాగుతున్న 182వ రోజు ప్రజాసంకల్పయాత్రలో హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీల గురించి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పదవులకు ఇంకా 14 నెలలు గడువున్నా రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేసిన వారికి తాను సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఎలాంటి భయం లేకుండా రాజీనామాలు సమర్పించారని, అదే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసివుంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భయపడ్డారని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే బుద్ధి ఉన్నా పార్టీ ఏదీ ప్రత్యర్థులుగా బరిలోకి నిలపదని అన్నారు.

అలా అభ్యర్థులను పెడితే ప్రత్యేక హోదాకు వారు అనుకూలమా? లేక వ్యతిరేకమా? అనే ప్రశ్న వస్తుందని చెప్పారు. అయినా, సిగ్గుమాలిన తెలుగుదేశం పార్టీ పోటీకి దిగితే అది వైఎస్సార్‌ సీపీ అదృష్టంగా భావిస్తుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.

ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయా?
ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయా? అని ప్రశ్నించిన ఓ జర్నలిస్టును ఉద్దేశించి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేశానని సీఎం చంద్రబాబుకు తెలుసని, అందుకే ఆయన మంచి చేస్తున్నవారిపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతూనే ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

అయినా వారిపై వేటు పడకుండా చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారని, వారితో రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. వారిని తిరిగి గెలిపించుకునే సత్తా లేకనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇని చేస్తున్న చంద్రబాబు చివరకు రాజ్యాంగం అపహస్యం అవుతుందని మాట్లాడతాడంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement