'దీపావళి రోజు ఏదైనా జరిగిందో మీ పోలీసుల సంగతి చెప్తా'
సాక్షి, లక్నో : తమ రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నడుంకట్టారు. ఇందుకోసం పోలీసులకు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి వెంటనే వారిని పంపించాలని ఆదేశించారు. చొరబాట్లను నిలువరించేలా ప్రత్యేకంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో కూడా గట్టి భద్రత ఏర్పాటుచేయాలని, అనుమానితులను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
'రాష్ట్ర వ్యాపంగా విదేశీయులు ఎంతమంది ఉంటున్నారో అధికారికంగా లెక్కలు నిర్వహించండి. ఎవరు అక్రమంగా ఉంటున్నారో వారిని తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంది. అలా కనిపించిన వారిని వెంటనే పంపించాలి' అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. 'నేరస్తులకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. వారిని వెంటనే బలగాలు పెట్టించైనా బయటకు పంపించాలి. ఈ పనిని పోలీసులే చేయాలి' అని ఆయన అన్నారు. 'ఈ దీపావళికి జరగరాని సంఘటనలు ఏమైనా జరిగితే మాత్రం సంబంధిత పోలీసులపై మాత్రం కచ్చితంగా యాక్షన్ ఉంటుంది. నేరుస్తులపై ఓ కన్నేసి ఉంచాలి. రాష్ట్రంలో ఉన్న 3,200 వాహనాలను నిత్యం పెట్రోలింగ్కు తిప్పాలి'