గుజరాత్‌ డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్‌ ఆఫర్‌

Gujarat Congress MLA Offers CM Post To Nitin Patel - Sakshi

గాంధీనగర్‌ : త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్‌లో బీజేపీ ఎమ్మెల్యేలపై గాలం వేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు మాట్లాడుతూ.. గుజరాత్‌ ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరితో ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో లాథీ నియోజకవర్గ ఎమ్మెల్యే విర్జీ తుమారానే  ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై అధికార పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ కూటమికి 77 స్థానాలు దక్కాయి. అయితే మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుజరాత్‌ కీలకంగా మారింది. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు తమ పార్టీలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top