‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’ | EX MLA Sampath Kumar Fires On CM KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

Jul 17 2019 3:19 PM | Updated on Jul 17 2019 4:36 PM

EX MLA Sampath Kumar Fires On CM KCR - Sakshi

థాయిలాండ్‌ ప్రధానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌ పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సార్థకతలేని అసెంబ్లీ సమావేశాలు ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నాయని విమర్శించారు. కేసీఆర్.. అసెంబ్లీని తన రాజరికపు, కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లులపై పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా చర్చ జరిపే పరిస్థితులు లేవన్నారు. ప్రశ్నించే వారిని కేసీఆర్‌ అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ తన ఇంట్లో తీసుకునే నిర్ణయాలను అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంటూ.. శాసనసభకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ తీసుకురాబోయే మున్సిపల్‌ చట్టంలో ఏముందో ఆయన కుటుంబానికి తప్ప మిగతావారెవ్వరికి తెలియదన్నారు. మంత్రులు సైతం కేబినెట్‌ భేటీలో వరుసగా నిలబడి సంతకాలు పెట్టడం తప్ప.. ఏంటని ప్రశ్నించే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని చెప్పారు. రైతుబంధు డబ్బులు సమయానికి అందక రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజల సొమ్మును తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్‌కు భవిష్యత్‌లో జెలు తప్పదని హెచ్చరించారు. థాయిలాండ్‌ ప్రధానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప వేరే అంశాలను పట్టించుకోని కేసీఆర్‌కు భవిష్యత్‌లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సంపత్‌కుమార్‌ అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement