
మమత బెనర్జీ (ఫైల్ ఫొటో)
కోల్కతా: తమ రాష్ట్ర ప్రజల్లో మతతత్వ భావం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సందర్భంగా సోమవారం మమత ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం. బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడు ఐకమత్యాన్ని, వైవిధ్యాన్ని నమ్ముతారు. మతతత్వ భావం బెంగాల్ ప్రజల ఆలోచనలోగాని, హృదయాల్లోగాని లేదు’ అని ట్వీటర్లో పేర్కొన్నారు.
గతకొంత కాలంగా బెంగాల్లో మతకల్లోలాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 2016 హౌరా అల్లర్లు, ఈ ఏడాది మార్చిలో అస్నాసోల్, రాణిగంజ్ ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి మతపరమైన ఘర్షణలు కావని, కేవలం చిన్న చిన్న స్థానిక ఘర్షణలు మాత్రమేనని మమత పేర్కొన్నారు.
బెంగాల్లో మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాలని బీజేపీ భావిస్తోందని మమత బెనర్జీ గతంలో అనేక సార్లు విమర్శించారు. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సారాజ్ గంగారం పార్లమెంట్కు సమర్పించిన ఓ నివేదికలో గత మూడేళ్ళుగా దేశంలో అత్యధికంగా మతకల్లోలాలు జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలివడం విశేషం.