కేసీఆర్‌ కుసంస్కారి: సురవరం

CPI Leaders Narayana And Suravaram Slams KCR In Delhi - Sakshi

ఢిల్లీ: ప్రతిపక్ష నేతలను సన్నాసులు, దద్దమ్మలు అంటూ నీచంగా మాట్లాడే కుసంస్కారి కేసీఆర్‌ అని అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి సురవరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషన్‌ను నిర్దేశించేలా కేసీఆర్‌ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ని కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తేదీలను కేసీఆర్‌ ప్రకటించడంపై మేం ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ది కుటుంబ క్యాబినేట్‌. చర్చ లేకుండా రెండు నిమిషాల్లో అసెంబ్లీకి రద్దు చేస్తూ క్యాబినేట్‌ తీర్మానం చేశారు. ఏక వ్యక్తి పార్టీ. పార్టీ పొలిట్‌బ్యూరోతో సంబంధం లేకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారు’ అని సురవరం విమర్శించారు .

నారాయణ మాట్లాడుతూ..కేసీఆర్‌ లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు. కేసీఆర్‌ వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు. కేసీఆర్‌ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి..సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top