
సాక్షి, హైదరాబాద్: అవసరం లేకున్నా డిగ్రీ కళా శాలల్లో ఆన్డ్యూటీ బదిలీల పేరుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు, యూనియన్ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికే బదిలీలు పూర్తిచేయాల్సిఉన్నా ఇంకా కొన సాగుతుండటమే దీనికి నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు.
యూనియన్ లీడర్లు, ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ మంత్రి, సన్నిహితులు మధ్యవర్తులుగా ఉండి ఓడీల పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణ బదిలీల్లో భాగంగా 31,514 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసిన ప్రభుత్వానికి, కేవలం 400లోపు ఉన్న అంతర్జిల్లాల భార్యా భర్తల బదిలీలు బరువయ్యాయా అని ఆయన ప్రశ్నించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను మానసిక వేధింపులకు గురిచేసేలా ప్రభుత్వ వైఖరి ఉందని తెలిపారు.