చంద్రబాబుకు అందుకే భయం: కాంగ్రెస్‌ నేత | Congress Leader Ramachandraiah Slams Chandrababu Over IT Raids | Sakshi
Sakshi News home page

Oct 6 2018 2:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Leader Ramachandraiah Slams Chandrababu Over IT Raids - Sakshi

సి. రామచంద్రయ్య (ఫైల్‌ ఫోటో)

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుని కొడుకు లోకేశ్‌కు, బినామిలకు పంచిపెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పు చేయనప్పుడు ఐటీ దాడులకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే నాటాకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవ చేశారు.

ప్రతీ పనిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అక్రమంగా ఇసుకను అమ్ముకుని టీడీపీ నాయకులు కోట్ల రూపాయలు సంపాదించారని ధ్వజమెత్తారు. మహిళా ఎమ్మార్వోను ఎమ్మెల్యే కొడితే చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల అవినీతి జరిగిందని.. ఇక పోలవరం ప్రాజెక్టులో అయితే లెక్కేలేదని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో బయటకు వచ్చిన ఆడియో వాయిస్‌ ఎవరిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పన్ను ఎగవేత దారులకు సీఎం అండగా ఉండటం దుర్మార్గమని, చంద్రబాబు, లోకేశ్‌లపైన విచారణ జరపాలని రామచంద్రయ్య కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement