ఆరింటిపైనే స్పష్టత..

Clarity About 6 Seats Says Prof Kodandaram - Sakshi

టీజేఎస్‌ అధినేత కోదండరాం వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించే సీట్లపై కాంగ్రెస్‌తో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తెలిపారు. తాము 11 స్థానాలు కోరు తుండగా.. ప్రస్తుతానికి ఆరు సీట్లపై స్పష్టత వచ్చిం దని వెల్లడించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, వర్ధన్నపేట, అంబర్‌పేట, మల్కాజ్‌గిరి స్థానాలు తమకే దక్కే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన స్థానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, దీనిపై కాంగ్రెస్‌తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే ఎవరూ అందుబాటులోకి రాలేదని వివరించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ స్థానంతోపాటు ఖమ్మం నుంచి ఒక బీసీ సీటును అడుగుతున్నామని పేర్కొన్నారు.

అన్ని స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. కాగా, జనగామలో పోటీచేసే విషయంపై మాట్లాడటానికి కోదండరాం నిరాకరించారు. అయితే, జనగామ బరి నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను మాత్రం ఖండించారు. ఊహాగానాల ఆధారంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. టీజేఎస్‌ నిలబడే స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉండదని స్పష్టంచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top