చంద్రబాబు ఇంకా అధికార భ్రమలోనే: బొత్స

Chandrababu Still Daydreaming Continues, says botsa satyanarayana - Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ వ్యాఖ‍్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీని జనం పరిగెత్తించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెలుగుదేశం శకం ఇక ముగిసిందని, వచ్చేది రాజన్న రాజ్యమేనని ఆయన అన్నారు. కొద్దిరోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మంచి సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని బొత్స అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలు ఆపకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు. చంద్రబాబుకు మాత్రం ఇంకా అధికారం మీద, సీఎం కుర్చీ మీద యావ తగ్గలేదని ఎద్దేవా చేశారు. ఇదే ధోరణి ఫలితాల తర్వాత కూడా ఉంటే ప్రమాదమన్నారు. 

విజయవాడ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు పదవీ వ్యామోహం పోలేదు. ఆయన ఇంకా అధికార భ్రమలోనే ఉన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం గౌరవం లేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా అధికారులతో ఎలా సమీక్షలు నిర్వహిస్తారు. చంద్రబాబు రాష్ట్రానికి ఉపయోగపడే సమీక్షలు జరపడం లేదు. అవినీతి కార్యక్రమాలను చక్కబెట్టే పనిలో ఉన్నారు. పాత బకాయిల కోసమే సీఎం సమీక్షలు చేస్తున్నారు.చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు వస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడే అందరూ ఉండాలి, అందుకు ఎవరూ అతీతులు కాదు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే అంత తమాషాగా ఉందా? న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం. ఎన్నికలనోటిఫికేషన్‌ వెలువడ్డ తర్వాత చంద్రబాబు 18 కాన్ఫిడెన్షియల్‌ జీవోలు జారీ చేశారు. అన్ని త్వరలోనే బయటకు వస్తాయి. 

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆనాడే చెప్పాం. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ముందుంటారు. పోలీస్‌ వ్యవస్థను కూడా ఆయన భ్రష్టు పట్టించారు. ఇంటెలిజెన్స్‌ శాఖ ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేసింది. ఏడాదిగా నా ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉంది. కాదని చెప్పమనండి?. ఎన్నికల సంఘం కూడా తన మాట వినాలని చంద్రబాబు అనుకోవటం అవివేకం. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చంద‍్రబాబు వ్యాఖ్యలు దారుణం. ఇక ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలలో బీజేపీతో కలిసి వెళ్లినప్పుడు ఈవీఎంలు కరెక్టు, ఇప్పుడు తప్పా?. వ్యవస్థలు అన్ని చంద్రబాబు తన చెప్పుచేతల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఆయనను చూస్తే జాలి వేస్తోంది.’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top