మియాపూర్‌ భూములపై సీబీఐ విచారణ | CBI probe on Miyapur lands | Sakshi
Sakshi News home page

మియాపూర్‌ భూములపై సీబీఐ విచారణ

Nov 20 2017 3:10 AM | Updated on Oct 30 2018 4:05 PM

CBI probe on Miyapur lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ మియాపూర్‌లోని 693 ఎకరాలకు సంబంధించిన సేల్‌ డీడ్‌ను రద్దు చేసినట్టుగా హైకోర్టులో ప్రభుత్వం తరపున బి.ఆర్‌.మీనా అఫిడవిట్‌ను దాఖలు చేశారని చెప్పారు. సేల్‌డీడ్‌లను రద్దు చేసే అధికారం సబ్‌ రిజిస్ట్రార్లకు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇటీవలనే తీర్పులను ఇచ్చాయన్నారు.

అయినా సేల్స్‌ డీడ్‌లను రద్దు చేసినట్టుగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్‌.మీనా హైకోర్టుకు ఎలా నివేదించారని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ముఖ్య పాత్రధారి అయిన గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌తో ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడ్డారని ఆరోపించారు. రద్దు చేసిన భూములకు సీఎం కేసీఆర్‌కూడా ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారని రఘునందన్‌రావు ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఒక సినిమా నిర్మాత 80 గుంటలు తీసుకొని 80 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కుంభకోణంలో మొదటి ముద్దాయి ప్రభుత్వమేనన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్‌ చేశారు. మియాపూర్‌ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు విషయంపై రెవెన్యూ మంత్రి మహమూద్‌ అలీ సమాధానం చెప్పాలని, సీఎం కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement