అందుకే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయట్లేదు

Buggana Rajendranath press meet on caag - Sakshi

అమరావతి : కాగ్ రిపోర్టుకు భయపడే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఏపీ పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..‘ 2014-15లో రూ. లక్ష 75 వేల కోట్ల అప్పులు చేశారు. ఇక 2015-16 లో 2 లక్షల కోట్ల అప్పు దాటారు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతానికి మించరాదన్న మీరు(చంద్రబాబు నాయుడు) అంతకు రెండింతలు అప్పులు చేశారు. 4 ఏళ్లలో 75 వేల కోట్లు రెవెన్యూ లోటు. ఇంతింత అప్పులు అంటే మీరు ఏం చేస్తున్నట్లు ..డబ్బులు ఎక్కడ పోతున్నాయి. అలా అని కేంద్ర నిధులు రావటం  లేదా అంటే బాగానే వస్తున్నాయి. 2014-15లో రూ.21,779 వేల కోట్లు. 2015-16  కేంద్రం నుంచి రూ.21, 927 కోట్ల నిధులు. 2017-18 రూ.23 346 వేల కోట్లు నిధులు వచ్చాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికంటే ఎక్కువగానే సెంట్రల్ గ్రాంట్స్ వచ్చాయి. అప్పు ఇచ్చేవాడు దొరికితే చాలు అన్నట్లు బ్రహ్మాండంగా అప్పులు చేస్తున్నారు’  అని చెప్పారు.

‘ కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నేను కడుతా అని రూ. 16 వేల కోట్లు ఉన్న అంచనా వ్యయ్యాన్ని రూ. 56 వేల కోట్లకి పెంచారు. సాధ్యం కాదని తెలిసి కూడా ఎందుకు పోలవరం  కడతా అన్నారు. ముడుపుల కోసం  కాకుండా రాజధాని కోసం కేంద్రమే భూమి, నిధులు ఇస్తామన్నా మీరే కడుతాం అన్నారు.  సింగపూర్, జపాన్ మాదిరి  కడతా అని దేశదేశాలు తిరిగి ఏం చేయలేకపోయారు. 2017-18కి లెక్కేస్తే రూ.2 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. ఇంతింత అప్పులు చేసి మీరు చేసింది ఏంటి వెలగపూడిలో 4 తాత్కాలిక  భవనాలు కట్టడం తప్ప..అవి తాత్కాలికం అని కట్టారు వర్షం పడితే నీరు కారుతాయి. ఎవరైనా దాని గురించి అడిగితే కళ్లు ఎర్రచేసి ఏం మాట్లాడుతున్నావంటూ విలేఖరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.’  అని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా గురించి మా నాయకుడు వైఎస్‌ జగన్ మాట్లాడితే మీకేం తెలుసు అన్నారు. యూపీ లాంటి జనాభా ఎక్కువ వున్న రాష్ట్రం కంటే హోదా ఉన్న రాష్ట్రాలకే నిధులు ఎక్కువ వస్తాయన్నా పట్టించుకోలేదు.ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు  కేంద్ర బడ్జెట్ లో 16-17 % నిధులు వస్తున్నాయంటే బుల్డోజ్ చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకే ఇన్సెంటీవ్‌లు వస్తాయని జగన్ మోహన్ రెడ్డి చెబితే ట్యూషన్ ట్యూషన్ అన్నారు. అంతా చెప్పి మీరు చేసింది ఏంటి రూ.90 వేల కోట్ల అప్పును రూ.2 లక్షల కోట్లకు దాటించారు. ఏమాత్రం సంబంధం లేకున్నా మీరు ఏపీలో  ప్రతీ ఒక్కరి తలపై 30 వేల అప్పు మోపారు. ఏమన్నా ఉంటే నాకు ఉన్న అనుభవం , విజనరీ ఎవరికీ లేదంటారు. 2020 నాటికి దేశంలో మూడవ రాష్ట్రం, 2025, 2029 అంటున్నారు. ఎవరుంటారు సార్ అప్పటివరకు. మీకు అభివృద్ది కాదు మీ వంశానికి అధికారం కావాలి. మీరు విజనరీ కాదు ఔట్ డేటెడ్ అని గుర్తించండి’  అని అన్నారు.

నిన్నటి వరకు మీతోనే ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాన్‌, బీజేపీ నేతలే మిమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పారు.మీ కుమారుడు లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తే ఇప్పటికీ సమాధానం లేదని, హోదా విషయంలో కూడా టీడీపీ నాయకత్వానికి, ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top