బాబు అవినీతితో ప్రపంచబ్యాంకు బెంబేలు

Buggana Rajendranath comments on Chandrababu Corruption - Sakshi

అందుకే అమరావతికి రుణంపై వెనకడుగు

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌  

కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 32 కోట్లా? ఇది ఎక్కడైనా ఉందా?

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భారీ కుంభకోణం

చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది ల్యాండ్‌ ‘ఫూలింగ్‌’

చంద్రబాబు అవినీతి, పర్యావరణానికి హానిపై రైతులు, మేధావుల ఆందోళన

దాంతో అమరావతిలో తనిఖీలు నిర్వహించిన ప్రపంచబ్యాంకు బృందం

రుణం ఇచ్చేముందు మరింత సమగ్రదర్యాప్తు జరపాలని నిర్ణయం

ఇది దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని భావించిన కేంద్రం

కేంద్రం సిఫార్సుతోనే అమరావతికి రుణసహాయం 

ప్రతిపాదనను రద్దు చేసుకున్న ప్రపంచబ్యాంకు 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అభివృద్ధి నమూనా పట్ల ప్రపంచబ్యాంకు సానుకూలత

ఆరోగ్య రంగ అభివృద్ధికి 328 మిలియన్‌ డాలర్ల రుణసహాయానికి ఆమోదం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర దుష్ప్రభావం చూపేలా అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టారని విమర్శించారు. కిలోమీటర్‌ రోడ్డుకు ఏకంగా రూ. 32 కోట్ల చొప్పున కాంట్రాక్టు కట్టబెట్టడం ఎక్కడైనా ఉందా? అని విస్మయం వ్యక్తం చేశారు. రైతులు, మేధావులు, ఎన్‌జీవోల ఫిర్యాదులపై స్పందించి ప్రపంచబ్యాంకు బృందం నిర్వహించిన తనిఖీల్లో చంద్రబాబు బండారం బట్టబయలైందని తెలిపారు. దాంతో అమరావతికి రుణమిచ్చే ముందు సమగ్ర దర్యాప్తు చేయాలని నిర్ణయించిందన్నారు. కానీ అది దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని కేంద్ర ప్రభుత్వం భావించిందని మంత్రి వివరించారు. కేంద్రం సూచనల మేరకే అమరావతికి రుణ సహాయం ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసుకుందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ అమరాతికి రుణ సహాయం చేసే ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకున్న అంశంలో తమ ప్రభుత్వ ప్రమేయమేమీ లేదంటూ వాస్తవాలను వివరించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు సానుకూలంగా స్పందించిన ప్రపంచబ్యాంకు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు 328 మిలియన్‌ డాలర్ల రుణ సహాయం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని ఆయన శాసనసభకు తెలిపారు. 

భూములివ్వని రైతుల పొలాలను తగులబెట్టారు.. 
అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది ల్యాండ్‌ పూలింగ్‌ కాదని ల్యాండ్‌ ఫూలింగ్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు. అధికార రహస్యాలను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విరుచుకుపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి తన బినామీల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను బెదిరించారని, వారి తోటలను టీడీపీ నేతలే తగులబెట్టించారని మండిపడ్డారు. అమరావతిలో రోడ్ల నిర్మాణానికి టెండర్లలో టీడీపీ ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడిందన్నారు. 5, 6, 7 ప్యాకేజీల టెండర్లను తమ సన్నిహిత సంస్థ ఎన్‌సీసీ సంస్థకు దక్కేలా చంద్రబాబు వ్యవహారం నడిపారని వివరించారు. ప్రపంచబ్యాంకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుంటే అమరావతి బాండ్ల పేరుతో అధిక వడ్డీకి రూ. 2 వేల కోట్లు బాండ్లు ఎందుకు సేకరించారని  ప్రశ్నించారు. తమ సన్నిహితులైన బడా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసమే బాండ్లు జారీ చేశారని విమర్శించారు. 

తనిఖీలతో బండారం బట్టబయలు 
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి దాదాపు రూ. 5 వేల కోట్ల రుణాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతిచ్చిందని బుగ్గన తెలిపారు. అందులో ప్రపంచబ్యాంకు రూ. 2,100 కోట్లు, ఏఐఐబీ రూ. 1,500 కోట్లు రుణాన్ని సమకూర్చితే... ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ. 1,500 కోట్లు కేటాయించేలా నిర్ణయించారని వివరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తూ, పర్యావరణం, మానవహక్కులకు భంగం కలిగిస్తూ సాగించిన కుంభకోణంపై పెద్ద సంఖ్యలో రైతులు, మేధావులు, ఎన్‌జీవోలు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దాంతో ప్రపంచబ్యాంకు నియమించిన తనిఖీల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించిందని చెప్పారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై పడే ప్రభావాన్ని మదింపు చేసి 2017, సెప్టెంబరు 27న తన తొలి నివేదిక, నవంబరు 27న రెండో నివేదిక, 2018, జూన్‌ 26న మూడో నివేదికను, 2019, మార్చి 29న తన తుది నివేదికను ప్రపంచబ్యాంకుకు సమర్పించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మీద చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదానికీ, రైతులు, ఎన్‌జీవోలు చెబుతున్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు తనిఖీల బృందం నిర్ధారించిందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండనుందని, పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని కూడా తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోతుగా దర్యాప్తు నిర్వహించాలని ఈ తనిఖీల బృందం సిఫార్సు చేసిందన్నారు. అంతవరకు రుణ మంజూరు చేయకూడదని నిర్ణయించిందని తెలిపారు. 

అది దేశ సార్వభౌమాధికారానికి భంగకరం  
అమరావతి ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న ప్రపంచబ్యాంకు తనిఖీల కమిటీ సిఫార్సుపై తమ ప్రభుత్వ వైఖరి ఏమిటని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ 2019, జూలై 1న తమను అడిగిందని బుగ్గన తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినందున ఈ విషయంలో నిర్ణయం తీసుకోడానికి తమకు నెలరోజులు గడువు కావాలని కేంద్రాన్ని కోరామని ఆయన వివరించారు. కానీ ప్రపంచబ్యాంకు దర్యాప్తునకు అనుమతించాలా వద్దా అనేదానిపై జూలై 15లోగా తమ వైఖరి తెలపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిందన్నారు. దాంతో దీనిపై కేంద్ర ఆర్థిక శాఖే తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మంత్రి బుగ్గన వెల్లడించారు. ఓ ప్రాజెక్టుకు రుణసహాయం చేసేముందే దర్యాప్తు చేయడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావించిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఇంతకుముందు దేశంలో ఏ ప్రాజెక్టు విషయంలో కూడా ఇలా చేయలేదని కేంద్రం గుర్తించిందన్నారు. అందుకే అమరావతి ప్రాజెక్టుకు రుణ సహాయం ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సమాచారమివ్వడంతో ప్రపంచబ్యాంకు సమ్మతించందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లే అమరావతికి రుణసహాయం ప్రతిపాదనపై ప్రపంచబ్యాంకు వెనక్కితగ్గిందని చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా అధిపతులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

అమరావతికి మీరిచ్చింది రూ. 277 కోట్లే
మేము రూ. 500 కోట్లు కేటాయించాం 
శాసన మండలిలో మంత్రి బుగ్గన 

గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట విరాళాల కోసం తిరుపతిలో హుండీ ఏర్పాటు చేసిందని, ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపక్ష పార్టీ సభ్యులను ప్రశ్నించారు. శాసన మండలిలో జరిగిన బడ్జెట్‌పై చర్చకు మంత్రి బుగ్గన సోమవారం సమాధానం ఇచ్చారు. ‘అమరావతి అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో మొత్తం రూ. 277 కోట్లు కేటాయిస్తే తాము ఈ ఏడాది రూ. 500 కోట్లు కేటాయించాం. రాజధాని నిర్మాణం ప్లాన్‌ కోసమని మలేసియా, సింగపూర్, కొరియా, జపాన్, కొలంబో, టర్కీ, లండన్‌ తదితర దేశాల్లో తిరిగి ఆఖరుకు ప్లాన్‌ తయారీకి రాజమౌళికి అప్పగించారు’ అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేకపోయిన రుణమాఫీ రెండు విడతల సొమ్మును ఇవ్వాలని అడిగే హక్కు ప్రతిపక్షానికి లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కోసం రూ. 8,750 కోట్లు కేటాయించిందని, సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 67 మంది సభ్యులు అప్పటి సీఎం చంద్రబాబును కలిస్తే ఇచ్చేది లేదన్నారని, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా నియోజకవర్గానికి రూ. కోటి కేటాయించి తన ఉదారతను చాటుకున్నారని గుర్తు చేశారు.  

అభివృద్ధి అజెండాకు ప్రపంచబ్యాంకు తోడ్పాటు  
రాష్ట్ర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అజెండా, నిబద్ధత పట్ల ప్రపంచబ్యాంకు అత్యంత సానుకూలంగా స్పందించిందని మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి ప్రపంచబ్యాంకు కొత్తగా 328 మిలియన్‌ డాలర్ల సహాయాన్ని మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ మేరకు 2019, జూన్‌ 27న ఒప్పందం కుదిరిందని తెలిపారు. తమ ప్రభుత్వ సుపరిపాలన అజెండా, అభివృద్ధికర పని విధానంపట్ల ప్రపంచబ్యాంకు హర్షం వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రభుత్వ వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాలు, నవరత్న పథకాల విధానాలు ప్రపంచబ్యాంకు అభివృద్ధి ప్రాధాన్యతలతో పూర్తిగా సరిపోలాయని ప్రపంచబ్యాంకు పేర్కొందన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top