బాబు నిప్పూ.. ఎయిర్‌ ఏషియాపై స్పందించు 

Botsa Satya Narayana demand to CM Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ 

సాక్షి, అమరావతి: తాను నిప్పునని చెప్పుకునే సీఎం చంద్రబాబు, నీతిమంతుడినని ప్రచారం చేసుకునే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు.. ఎయిర్‌ ఏషియా కుంభకోణంపై స్పందించాలని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌ ఏషియా సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసుల అనుమతి కోసం సీఎం చంద్రబాబును దళారీగా ఎంచుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఎయిర్‌ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా విభాగం సీఈవో మిట్టూ శాండిల్య మధ్య జరిగిన సంభాషణ బహిర్గతమైనా.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఇదంతా జరిగిన తర్వాతే ఎయిర్‌ ఏషియా సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుకునేందుకు అనుమతినిస్తూ 2016లో జీవో విడుదలైందని గుర్తు చేశారు. దీనికోసం నిబంధనలు సైతం మార్చారని చెప్పారు. ఈ వ్యవహారంలో లాబియింగ్‌ చేసినందుకు సింగపూర్‌కు చెందిన హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ కంపెనీకి రూ.12.28 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు.

ఆ కంపెనీకి చెందిన రాజేంద్ర దూబే.. మీరు సింగపూర్‌ వెళ్లినప్పుడల్లా పక్కనే ఉంటుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య సంబంధమేంటో తేల్చాలని డిమాండ్‌ చేశారు. అశోక్‌గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో.. ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాల కొనుగోలు, రక్షణ శాఖకు సంబంధించి ఆయుధాల విడిభాగాల కొనుగోలులోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారీతో అశోక్‌ గజపతిరాజు ఓఎస్‌డీ అప్పారావుకు సంబంధాలున్నాయని.. ఈ అప్పారావు నారా లోకేశ్‌కు అత్యంత ఆప్తుడని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top