పోలీసులను లెక్కచేయకుండా రౌడీయిజం

Bonda Umamaheswara Rao Fire On YSRCP Leaders - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రచార కాన్వాయ్‌ను అడ్డుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

‘నీ అంతు చూస్తా’ అంటూ బొండా ఉమా బెదిరింపులు

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా కుమారులు పట్టపగలే.. నడిరోడ్డుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కాన్వాయ్‌ను అడ్డుకుని వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రత్యర్థులను నోటికొచ్చినట్లు దూషిస్తూ.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టిస్తూ అల్లర్లు సృష్టించారు. సెంట్రల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణుకు మద్దతుగా విజయవాడలోని పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

బుడమేరు నుంచి దేవినగర్‌లోకి వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా ఇంతలో అటుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా సతీమణి బొండా సుజాత, వారి తనయులు బొండా సిద్ధు, రవితేజ ఎన్నికల ప్రచారం చేస్తూ వేర్వేరు వాహనాల్లో వచ్చారు. కోగంటి సత్యం కాన్వాయ్‌పై నుంచి ప్రచారం చేస్తుండగా టీడీపీ కాన్వాయ్‌పై ఉన్న బొండా అనుచరులు, అభిమానులు ఆయన్ను చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు.

వీధి రౌడీల్లా ప్రవర్తించిన బొండా కుమారులు
బొండా కుమారులు వాహనాలను రోడ్డు మధ్యలో ఆపివేసి రెచ్చగొట్టేలా మైకులో వ్యాఖ్యలు చేశారు. అక్కడికి వచ్చిన బొండా ఉమా ‘నీ అంతు చూస్తా’ అంటూ కోగంటి సత్యంపై బెదిరింపులకు దిగారు. విషయం వైఎస్సార్‌సీపీ నేతలకు తెలిసి భారీగా కార్యకర్తలు అక్కడకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి జారుతుందని గ్రహించిన పోలీసులు రంగంలోకి దిగి బొండా తనయుల వాహనాలను ముందుకు వెళ్లాలంటూ గట్టిగా చెప్పడంతో నినాదాలు చేస్తూ వెళ్లారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు ఆగ్రహానికి గురవుతుండగా సత్యం కలుగజేసుకొని వచ్చేయండంటూ పార్టీ శ్రేణులను వెనక్కి తీసుకువెళ్లిపోయారు. బొండా కుమారుల ఆగడాలు చూసి విస్తుపోయామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top