'ఆ మంత్రిని ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌ అనలేదు'

bolishetty srinivas comment on manikyala rao - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మాణిక్యాలరావును ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌ అని అనలేదని, ఆఫ్టర్‌ ఫొటోగ్రాఫర్‌ మంత్రి అని మాత్రమే అన్నానని తాడేపల్లిగూడెం మున్సిపల్‌  చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రే తమను ఉద్దేశించి ఆఫ్ట్రాల్‌ కౌన్సిలర్లు అని ఎద్దేవా చేశారని పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్న సంగతి తెలిసిందే. జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై విమర్శలు చేశారు. ఆయనను ఉద్దేశించి ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌ అని పేర్కొనడం దుమారం రేపింది.  బొలిశెట్టి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్యాలరావు.. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని అన్నారు.

‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు.  నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్‌కు ఫొటోగ్రాఫర్‌ని, ఆటోడ్రైవర్‌కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top