బంగ్లాలో ప్రతిదీ ప్రత్యేకమే: సుశీల్‌ మోదీ

7-Star Bungalow Vacated By Tejashwi Yadav - Sakshi

సాక్షి, పాట్నా : ఎట్టకేలకు బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ ప్రభుత్వ అధికారిక బంగ్లాలోకి మకాం మార్చారు. దేశ్‌రత్న మార్గ్‌లోని ప్రభుత్వ నివాసంలోకి ఆయన నిన్న (మంగళవారం) ప్రవేశించారు. ఈ సందర్భంగా సుశీల్‌ మోదీ మాట్లాడుతూ...‘ ఈ బంగ్లా చూస్తుంటే సెవన్‌ స్టార్‌ హోటల్‌లో ఉన్నట్లు ఉంది. ఈ బంగ్లాలో ప్రతిదీ ప్రత్యేకమే. ఇందుకోసం కోట్లాది రూపాయిలు దుబారా చేశారు. ప్రధానమంత్రి నివాసంలో కూడా ఇంతటి విలాసవంతమైన ఫర్నిచర్‌ ఉండదేమో’ అని వ్యాఖ్యానించారు. కాగా 2015లో ఈ బంగ్లాను అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్‌కు నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ఆ పార్టీ మహా కూటమితో విడిపోవడం, ఆ తర్వాత నితీష్‌ కుమార్‌ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. దీంతో తేజస్వి యాదవ్‌ ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే తన తల్లి రబ్రీదేవి సీఎంగా పనిచేసిన సమయంలో ఆ  భవనాన్ని ఉపయోగించడంతో సెంటిమెంటుగా భావించిన ఆయన ఖాళీ చేయలేదు. 

మరోవైపు ఆ బంగ్లాను డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీకి నితీష్‌ సర్కార్‌ కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేస్తూ తేజస్వి యాదవ్‌ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఆయనకు అక్కడ చుక్కెదురైంది. తక్షణమే బంగ్లాను ఖాళీ చేసి, ప్రతిపక్ష నేతకు కేటాయించిన బంగ్లాలోకి మారాలని సూచించింది. అంతేకాకుండా ఈ అంశంపై పాట్నా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తేజస్వి యాదవ్‌ సవాల్‌ చేయడంపై ఆయనకు ఉన్నత ధర్మాసనం రూ.50 జరిమానా కూడా విధించింది. దీంతో ఎట్టకేలకు ఆ బంగ్లాను ఖాళీ చేసిన తేజస్వి యాదవ్‌ ఆ తర్వాత కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. బీహార్‌ ప్రభుత్వం ఆ బంగ్లాలోకి దెయ్యాలు వదిలిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు. గతంలో వాస్తు పేరుతో తేజస్వి యాదవ్‌ ఆ భవనం మరమ్మతులకు కోట్లాది రూపాయిలు వెచ్చించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top