అసెంబ్లీ మీడియా పాయింట్‌

అదో అబద్ధాల ప్రసంగం
గవర్నర్‌ ప్రసంగమంతా అబద్ధాలే. గవర్నర్‌ చేత నాలుగేళ్లుగా ఇదే ప్రసంగాన్ని ప్రభుత్వం చెప్పిస్తోంది. రైతు ఆత్మహత్యలు, లక్ష ఉద్యోగాల అంశాలు ప్రసంగంలో ఎందుకు లేవు?    – కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత
 
కేసీఆర్‌ మాట తప్పారు
దళితుడిని సీఎం చేస్తామన్న కేసీఆర్‌ మాట తప్పారు. గవర్నర్‌ ప్రసంగంలో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు ప్రస్తావన ఏదీ? గవర్నర్‌ అబద్ధాల ప్రసంగం వినలేక సభ నుంచి వాకౌట్‌ చేశాం.     – లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసేదీ?

రాష్ట్రంలోని అణగారిన వర్గాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు, కల్యాణలక్షి పథకంలో పెంపుదల అంశం ప్రసంగంలో లేదు.  – ఆర్‌. కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే
 
సంక్షేమాన్ని నిర్లక్ష్యంలో పడేశారు

టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలు నెరవేర్చేలా గవర్నర్‌ ప్రసంగం లేదు. సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిరసన తెలిపేందుకు ఉన్న హక్కును హరించింది. ధర్నా చౌక్‌ను ఎత్తేసింది.     – సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే
 
గవర్నర్‌ ప్రసంగం వాస్తవ విరుద్ధం

గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర పరిస్థితులకు విరుద్ధంగా ఉంది. అటవీ హక్కు చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. మిషన్‌ భగీరథ వంటి పథకాలు కాంట్రాక్టర్ల కోసమే చేపడుతోంది. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులకు గిట్టుబాటు ధర గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.     – సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
 

గూండాగిరి.. దాదాగిరి చేస్తారా?
అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గూండాగిరి, దాదాగిరి చేశారు. దాడులకు పాల్పడితే సహించేది లేదు. గవర్నర్‌ ప్రసంగంలో ఏం తప్పుందో చెప్పాలి.     – శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  
 
చరిత్ర పేరుకేనా?
గవర్నర్‌పై కాంగ్రెస్‌ చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఆ పార్టీకి ఉన్న 125 ఏళ్ల చరిత్ర పేరుకేనా? కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్‌కన్నా మా ప్రభుత్వమే ఎక్కువగా ఆదుకుంటోంది. – నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ
 
అభివృద్ధిని అడ్డుకోవడానికే...
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే – ఎ. జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసహనంతో దాడులకు పాల్పడటం రాష్ట్ర అభి వృద్ధిని అడ్డుకోవడమే. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలాచర్యలు తీసుకున్నారో ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలి.   
 
ఇదెక్కడి సంప్రదాయం?
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వద్ద విషయం లేకనే దాడులకు పూనుకున్నారు. కుట్రపూరితంగానే స్పీకర్‌ పోడియంపై మైక్‌ విసిరారు. స్పీకర్‌ సూచనలను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్‌ సభ్యులు దాడులకు పాల్పడటం ఎక్కడి సంప్రదాయం?      – కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top