కూల్చివేతపై కేసు ఎందుకు..?: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు చట్ట విరుద్ధమైతే కూల్చివేతపై కేసు ఎందుకు నడుస్తోంది, అద్వానీపై విచారణ ఎందుకు జరుగుతోందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూటిగా ప్రశ్నించారు. మిలాద్–ఉన్–నబీ సందర్భంగా శనివారం అర్ధ రాత్రి హైదరాబాద్లోని దారుస్సలాం మైదానంలో జరిగిన రహమతుల్–లిల్–అలామీన్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బాబ్రీ మసీదు చట్టవిరుద్ధమైతే కూల్చివేతకు పాల్పడిన వారు భూమిని ఎలా పొందగలుగుతారని చెప్పారు. సాధారణంగా ఒకరి ఇంటిని కూల్చేసిన వ్యక్తికి అదే ఇల్లు మరలా ఎలా లభిస్తుందని దుయ్యబట్టారు.
సుప్రీం కోర్టు తీర్పుపై రాజ్యాంగబద్ధంగా అభిప్రా యాన్ని వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని గుర్తు చేశారు. బాబ్రీ మసీదుపై చట్టపరమైన హక్కు కోసం పోరాటం చేశామని, మసీదుకు ప్రత్యామ్నాయంగా 5ఎకరాల భూమి ఇవ్వ డం అవమానించడమేనన్నారు. సుప్రీంలో ముస్లింల పక్షాన ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఇస్లామిక్ స్కా లర్స్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.